- సినిమా షూటింగ్లకే పరిమితమయ్యాడని విమర్శలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరే సపరేటు. సినిమా రంగంలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉన్నా, రాజకీయాల్లో మాత్రం ఆయన ఇంకా ఓనమాలే నేర్చుకుంటున్నారు. రాజకీయాన్ని ఆసాంతం ఒంటపట్టించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో తిరుగుతున్నా ఆయనకు మాత్రం అది ఎక్కడం లేదు. ఆయన బుధవారం తూర్పు గోదావరి జిల్లా పర్యటన విమర్శలకు కేంద్ర బిందువైంది. తెలుగు రాష్ర్టాల్లో వర్షం బీభత్సం సృష్టించి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలో దాని తీవ్రత ఎక్కువగానే ఉంది.
షూటింగ్ గ్యాప్ లో రాకపై విమర్శలు..
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన మహారాష్ట్రలో చిత్రీకరణలో పాల్గొంటున్నారు. రైతులు పంటలు నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే, ఓ పార్టీ అధినేతగా పవన్ దూరంగా ఉండడం ఈ విమర్శలకు కారణమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తూ.గో జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. రైతులను ఆదుకోవాలని ఏకంగా వైసీపీ ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. లేకుంటే ఆందోళనలు చెపడుతామని హెచ్చరించారు. కానీ పవనుడి జాడ లేదు. వరుణుడొచ్చి ముంచెత్తినా పవనుడు వచ్చి పరామర్శించకపోవడం విమర్శలకు కేంద్ర బిందువైంది. షూటింగ్ గ్యాప్ లో వీలు చూసుకొని వచ్చి పరామర్శించడమేంటని చర్చ కొనసాగుతున్నది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే రైతులను ఆదుకునే చర్యలకు పూనుకుంది. ఇప్పుడు జనసేనాని రాకలో అంతర్యమేంటో తెలియడం లేదని పలువురు మాట్లాడుకుంటున్నారు. అకాల వర్షం వచ్చి ముంచెత్తిన సమయంలో రాకుండా. పవనుడి ఈ అకాల రాక ప్రస్తుతం పలు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.