Software Sector : సాఫ్ట్ వేర్ జాబ్ అనేది చాలా మందికి ఒక కల. డబ్బుకు డబ్బు.. ఎంజాయ్ మెంట్ కు ఎంజాయ్ మెంట్.. పోష్ లైఫ్ లీడ్ చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే ఎంత కష్టమైనా ఫర్వాలేదనుకుని బీటెక్ లో జాయిన్ అవుతారు. బీటెక్ కాగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ కొట్టాలని చాలామంది కోరుకుంటారు. ఒకవేళ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టలేకపోయినా.. ఏదో ఒక కోర్స్ నేర్చుకొని అందులో నైపుణ్యం పొంది ఉద్యోగం పొందేవారు. కానీ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి.
కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగాల్లోనూ మార్పులు వస్తున్నాయి. పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాలపై దృష్టిపెడుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలే ఉద్యోగులను తీసేస్తున్నారన్న వార్తలు భయపెడుతోన్న వేళ, లెవెల్స్.ఎఫ్వైఐ అనే ప్లాట్ ఫామ్ కొన్ని కీలక విషయాలను వెల్లడించింది.
ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం తప్పనిసరి అవుతోంది. దాదాపు అన్ని సెక్టార్లలో ఏఐ వినియోగం పెరిగిపోయింది. దీంతో ఐటీ ఉద్యోగులు కచ్చితంగా తమ స్కిల్స్ను అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒక కోర్స్తో సరిపెట్టుకుంటామనే రోజులు పోయాయి. కచ్చితంగా వారు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు అప్డేట్ కావాల్సిందే. ప్రపంచ దిగ్గజ సంస్థలు.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటివి సైతం ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం ఉన్న ఇంజినీర్ల భర్తీకే ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఓవైపు లేఆఫ్ భయాల నడుమ ఈ టెక్నాలజీలో ప్రావీణ్యం ఉన్న వారికి ఎక్కువ శాలరీలు చెల్లిస్తున్నాయి. సాధారణ ఐటీ నిపుణులతో పోల్చితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన ఉన్న వారికి 50 శాతం ఎక్కువ జీతం చెల్లిస్తున్నాయని ‘లెవెల్స్.ఎఫ్వైఐ’ తన తాజా నివేదికలో పేర్కొంది. గత నెలాఖరు నాటికి అమెరికాలో ఏఐ స్కిల్స్ ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల వేతనం ఏటా సరాసరి మన కరెన్సీలో రూ.2,49,31,650గా ఉంది.
సాధారణ ఐటీ ఉద్యోగులతో పోల్చితే వీరికి సుమారు లక్ష డాలర్లు అధికంగా ఇస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. అయితే రెండేళ్ల క్రితం ఏఐ నిపుణులు, సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల మధ్య వేతనంలో వ్యత్యాసం 30 శాతం ఉంటే, ఇప్పుడది ఏకంగా 50 శాతానికి చేరుకున్నది. దీనిబట్టే రానున్న రోజుల్లో ఏఐ నిపుణులకు ఎలాంటి డిమాండ్ ఉండనుందో అర్థమవుతుంది.