Joined Jana Sena Got Ticket : తెలంగాణలో పోటీకి జనసేన రెడీ అంటోంది. టికెట్ల కేటాయింపులో వేగం పెంచుతోంది. ఈమేరకు కూకట్ పల్లి నుంచి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, వెస్ట్ జోన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు జనసేన టికెట్ కేటాయించారు. బీజేపీతో కుదిరిన ఒప్పందంలో భాగంగా జనసేన 9 స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ పోటీకి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.
ఆర్థిక పరంగా, సామాజిక పరంగా బలంగా ఉండటంతో ప్రేమ్ కుమార్ అభ్యర్థిత్వానికి పవన్ కల్యాణ్ మొగ్గు చూపినట్లు సమాచారం. ఇంతకుముందే వీరి మధ్య స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు నేతలను జనసేనలో చేర్చుకునేందుకు రెడీ అయినట్లు చెబుతున్నారు. సినీ నటుడు సాగర్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వ్యాపారవేత్త లక్కినేని సురేందర్ రావులను చేర్చుకున్నారు.
త్వరలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. రెండు నెలల క్రితమే బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రేమ్ కుమార్ ఇప్పుడు జనసేనలో చేరి టికెట్ సాధించారు. అలా చేరి ఇలా టికెట్ తెచ్చుకున్నారనే వాదన తెరమీదకు వస్తోంది. దీంతో జనసేన ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రేమ్ కుమార్ కు పవన్ కల్యాణ్ కు ఉన్న అనుబంధంతోనే జనసేన పార్టీలో చేరారని సమాచారం. దీంతో కూకట్ పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థికి దీటుగా ప్రేమ్ కుమార్ పోటీ ఇస్తారనే అనుకుంటున్నారు. దీంతో ఇక్కడి రాజకీయం రసకందాయకంలో పడింది. ఏది ఏమైనా తెలంగాణలో కూడా జనసేన తన ప్రభావం చూపాలని కోరుకుంటోందని దీని ద్వారా తెలుస్తోంది.
జనసేనను నమ్ముకుని ఉన్న శంకర్ గౌడ్ ను కాదని ఇప్పుడు ప్రేమ్ కుమార్ కు టికెట్ ఇవ్వడంతో ఇన్నాళ్లు ఆయన పార్టీ జెండా మోసినా అన్యాయమే జరిగిందని అతడి అనుచరులు చెబుతున్నారు. పార్టీలోకి ఇలా వచ్చి అలా టికెట్ సాధించుకున్న వైనంపై పెదవి విరుస్తున్నారు. శంకర్ గౌడ్ ఆశలన్ని అడియాశలే అయ్యాయి.