Revanth Reddy Challenged : తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పరస్పర మాటల వేడి రగులుతోంది. ప్రజలకు సేవ చేసిన పార్టీగా ఇరు పార్టీలు సవాలు విసురుతున్నాయి. మీరు చేసిన పనులు చెప్పుకోండి మేం చేసిన పనులు చూపిస్తాం. ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో చూద్దాం. వాపును చూసుకుని బలుపని మురుస్తున్నారని ఎద్దేవా చేసుకుంటున్నారు.
పనులు మేం చేశామంటే మేం చేశామని వాదించుకుంటున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారో మీరు చెప్పాలి. మేం ఇందిరమ్మ ఇళ్లు ఎంత మందికి ఇచ్చామో చెబుతాం. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లకు సవాలు విసిరారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి అంటూ తొడగొడుతున్నారు. డెవలప్ మెంట్ చేశామని చెప్పుకుంటున్నా అందులో నిజమెంతో అబద్ధమెంతో నిరూపిస్తాం అని చెబుతున్నారు.
ఉచిత కరెంటు గురించి ఊదరగొడుతున్నారు. ఎక్కడ 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నారో చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫుల్ కరెంట్ కొన్ని గంటలకే పరిమితం చేసి 24 గంటలు అని తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మేం ప్రజల సమక్షంలో తేల్చుకున్నాకే నామినేషన్లు వేద్దామని ప్రతిజ్ణ చేశారు.
డిసెంబర్ 9న రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఆరు గ్యారెంటీలతో ప్రజలకు మేలు కలుగుతుంది. అందుకే పార్టీని నమ్ముతున్నారు. బీఆర్ఎస్ పార్టీని చిత్తు చేయడం మీరే చూస్తారని అంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ ఏం కౌంటర్ ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి. మొత్తానికి రాజకీయం రసవత్తరంగా మారుతోంది.