BJP Master Plan : బీఆర్ఎస్ లో ఓటమి ఎరుగని నేతలు ఎవరని అడిగితే ఠక్కున చెప్తే పేర్లు మూడు. 1. కేసీఆర్, 2. హరీశ్ రావు, 3. కేటీఆర్. వీరికి ఇప్పటి వరకైతే ఓటమి లేదు. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా చెక్ పెట్టాలని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ భావిస్తున్నాయి. అందుకు పశ్చిమ బెంగాల్ ప్లాన్ ను బీజేపీ సిద్దం చేసింది. అక్కడ గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సురేందు అధికారిని బరిలోకి దింపింది. ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉన్న వారిని బరిలోకి దింపితే బాగుంటుందని బీజేపీ స్కెచ్ వేసింది. దీంతో బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని కమలనాథులు అనుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ పై..
1983లో ఒక సారి ఓటమి పాలైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తర్వాత ఓటమి అన్నది చూడలేదు. అసెంబ్లీ ఎన్నికలు అయినా, పార్లమెంట్ ఎన్నికల అయినా ఆయనకు ఇప్పటి వరకు ఓటమి లేదు. సిద్ధిపేట నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత గజ్వేల్ కు మారారు. 2018 ఎన్నికల్లో 58 వేల మెజారిటీతో విజయంసాధించిన కేసీఆర్ ఇక ఇక్కడ హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
అయితే ఈ సారి ఆయన రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. ఒకటి గజ్వేల్ అయితే.. రెండోది కామారెడ్డి. ఆయన పోటీ చేస్తున్న స్థానంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు చేస్తున్నాయి. గజ్వేల్ లో ఈటలను బరిలోకి దింపితే.. కామారెడ్డి నుంచి విజయశాంతిని దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈటల హుజూరాబాద్ లో బరిలో ఉంటారా? అన్న ప్రశ్నకు హుజూరాబాద్ తోపాటు గజ్వేల్ బరిలో ఉంటారన్న సమాధానం వినిపిస్తుంది.
ఇక కాంగ్రెస్ ప్లాన్ ను పరిశీలిస్తే గజ్వేల్ నుంచి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కామారెడ్డిలో షబ్బీర్ అలీని బరిలో దించాలని యోచిస్తోంది. దీన్ని పరిశీలిస్తే.. గజ్వేల్ లో ఈటలతో, కామారెడ్డిలో షబ్బీర్ అలీతో బీజేపీ, కాంగ్రెస్ లు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎంత గట్టి అభ్యర్థిని బరిలోకి దించితే అంతపెద్ద మెజారిటీ వస్తుందని ఉత్తర ప్రగల్బాలు పలకడం బీఆర్ఎస్ నాయకులు తీసుకుంటున్నారు.
సిద్ధిపేటలో హరీశ్ రావుపై..
ఇక తర్వాత నియోజకవర్గం సిద్ధిపేట. ఈ నియోజకవర్గంకు మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మామ కేసీఆర్ ఇక్కడి నుంచి గజ్వేల్ కు వెళ్లిపోయిన తర్వాత సిద్ధిపేటను హరీశ్ రావు ఏలుతున్నారు. ఎలక్షన్ ఎలక్షన్ కు మెజరిటీ పెంచుకుంటూ పోతున్నారు. అతి చిన్న వయస్సులోనే డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేగా రికార్డులు సాధించారు హరీశ్ రావు. 2004లో 18వేల మెజారిటీ గెలుపును ప్రారంభించిన హరీశ్ రావు 2018కి వచ్చే సరికి లక్షా 18వేల మెజారిటీని దక్కించుకున్నాడు. ఈ సారి మరింత పెరిగుతుందని హరీశ్ రావు మద్ధతు దారులు అంటుండగా ఖచ్చితంగా తగ్గించడమే కాదు.. ఓడిస్తాం కూడా అంటూ బీజేపీ, కాంగ్రెస్ చెప్తోంది.
ఈ సారి హరీశ్ రావుపై పోటీకి బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావును తీసుకచ్చే యోచనలో ఉంది బీజేపీ. రఘునందన్ రావు కూడా ఇటు సిద్ధిపేటలోనైనా.. అటు గజ్వేల్ లో నైనా అల్లుడిపైనా.. మామపైనా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రతీ సారి చెప్తూ వస్తున్నారు. బీజేపీ ఈ ప్లాన్ అమలు చేస్తే హరీశ్ మెజార్టీ చాలా వరుకు తగ్గుతుంది. ఒక దశలో రఘునందన్ రావు కూడా గెలిచే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సిరిసిల్లలో కేటీఆర్ కు చెక్..
ఇక మరో నియోజకవర్గం సిరిసిల్ల. ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) బరిలో ఉన్నారు. సిరిసిల్లను కేటీఆర్ బీఆర్ఎస్ కు కంచుకోటగా మార్చాడు. 2009లో తొలిసారిగా విజయం సాధించిన కేటీఆర్ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు 171 ఓట్లతో బయట పడ్డాడు. ఇక 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 68 వేలకు పైగా ఓట్లతో రెండో సారి, స్వరాష్ట్రంలో జరిగిన 2014 ఎన్నికల్లో 53వేల మెజారిటీ, 2018లో 89 వేల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన తనకు బాగా అచ్చొచ్చిన సిరిసిల్ల నుంచే పోటీ చేస్తున్నారు.
అయితే ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి బండి సంజయ్ ను దింపే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి కూడా బలమైన నేత కేకే మహేందర్ రెడ్డిని పోటీకి రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు కేవలం బీఆర్ఎస్ మాత్రమే అభ్యర్థులను ఫైనల్ చేయగా.. కాంగ్రెస్ రేపు (అక్టోబర్ 15) అభ్యర్థులను ప్రకటిస్తుంది. బీజేపీ ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేదు. ఈ నేపథ్యలో ఈ మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు గెలిచినా, బీఆర్ఎస్ మెజిరిటీని తగ్గించినా నైతికంగా గెలిచినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.