కేరళ ప్రభుత్వ నిర్వహించే లాటరీలో భాగంగా టికెట్ కొనేందుకు 11 మంది మహిళలు ఏకమయ్యారు. వారంతా తాము కూడబెట్టుకున్న డబ్బులు రూ.250తో టికెట్ కొనుగోలు చేశారు. ఎంతో కొంత తగులుతుందని వారంతా ఆశగా ఎదురు చూశారు. కానీ అనుహ్యంగా వారికి రూ.10 కోట్లు కలిసి వచ్చింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
కేరళ రాష్ట్రం, కొజికోడ్ జిల్లా, మలప్పురం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న 11 మంది మహిళలు తమకు వచ్చే వేతానాలు సరిపోవడం లేదని, లాటరీ కొంటే ఏమైనా సాయంగా నిలవకపోదా? అని తలోకొంచెం పోగేసి రూ. 250 చేసి టికెట్ కొనుగోలు చేశారు. వీరిలో 9 మంది రూ. 25 వేసుకుంటే.. మరో ఇద్దరు రూ.12.50 వేసుకున్నారు. లాటరీలో డబ్బులు వస్తే కనీస అవసరాలు తీర్చుకోవాలని భావించారు.
తాజాగా ప్రకటించిన ఫలితాల్లో పారిశుధ్య కార్మికులు కొనుగోలు చేసిన టికెట్ కు ఏకంగా రూ.10 కోట్ల జాక్ పాట్ తగిలింది. ఇది నిజమా? కలా? నమ్మలేకపోయారు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారు. రూ. 10కోట్లు తమకే వచ్చిందని సంతోషంలో మునిగిపోయారు. ఆ మొత్తాన్ని 11 మంది సమానంగా పంచుకున్నారు. వీరిని చూసి మిగతా కార్మికులు అసూయ పడుతున్నారు. ఈ డబ్బుతో ఇళ్లు కట్టుకుంటామని కొందరు అంటే.. పిల్లల ఫీజులు కడతామని మరికొందరు అంటున్నారు.