KTR Team Leader : తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే సీఈసీ రెండు రోజుల క్రితం రాష్ర్టంలో పర్యటించి వెళ్లింది. ఇక ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే మిగతా పార్టీల కంటే ముందు తన అభ్యర్థులను ప్రకటించింది. గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ చేర్చుతున్నది. ఎక్కడా లోటు రాకుండా చూసుకుంటున్నది. సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఓటర్లే బీఆర్ఎస్ కు ప్రస్తుతం కీలకంగా ఉన్నారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ కు దీటుగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆ పార్టీలో మునుపెన్నడూ లేనంతగా జోష్ కనిపిస్తున్నది.
కాగా, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు వారాలుగా ప్రజా క్షేత్రంలోకి రావడం లేదు. ఆయన అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు. అయితే ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నారని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఏదో పెద్ద వ్యూహం సిద్ధం చేస్తున్నారని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ ను ముందుండి నడిపించే బాధ్యత యువనేత, మంత్రి కేటీఆర్ పై పడింది. ఆయన ఇప్పటికే అన్ని జిల్లాల్లో వరుసగా పర్యటిస్తు్న్నారు. క్యాడర్ ను సంసిద్ధం చేస్తున్నారు. ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందో, అక్కడ నిధులు, అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారు.
ఇక ఈ ఎన్నికల్లో కేటీఆర్ సారథ్యంలోని పార్టీ తన బలం నిరూపించుకుంటుందని అంతా భావిస్తు్న్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ అనారోగ్యం బారిన పడడంతో, ఇక అన్నీ తానై నడిపించేందుకు మంత్రి కేటీఆర్ సిద్ధమయ్యారు. పాలనావ్యవహారాలు కూడా తానే చూసుకుంటున్నారు. కొత్తగా ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రతిపక్షాలకు దీటైన సమాధానాలిస్తూ, తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయనెంటో గతంలోనే పలుమార్లు నిరూపించుకున్నారు,. ఇక రానున్న ఎన్నికల తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తున్నది.