Jaggampeta News : చెడ్డ కొడుకులుంటారేమో కానీ చెడ్డ తల్లిదండ్రులు ఉండరంటారు. కానీ ఇక్కడ ఓ తల్లి తన ఏడాది వయసున్న బాబును నడిరోడ్డుపై వదిలింది. మానవత్వానికే మచ్చ తెచ్చింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కొడుకును అన్యాయంగా రోడ్డుపై వదిలి తనలో తల్లితనం లేదని నిరూపించుకుంది. అపురూపంగా చూసుకోవాల్సిన కన్న పేగునే కాదనుకుంది.
నవమాసాలు మోసి కన్న కొడుకును నడిరోడ్డుపై వదిలేసింది. దొరికిన వారు బాబును బాగా చూసుకోవాలని ఓ లేఖ కూడా అతడి జేబులో పెట్టింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో శనివారం రాత్రి ఓ బాలుడు జగ్గంపేట-గోకవరం రోడ్డులో నెహ్రూ కాలనీ ప్రధాన ద్వారం వద్దనున్న చర్చి దగ్గర ఓ ఏడాది వయసున్న బాలుడు తచ్చాడుతుండగా ఫాస్టర్ కె.జె.సాల్మన్ రాజ్ చూసి పోలీసులకు అప్పగించారు.
బాబు జేబులో ఉన్న లేఖలో ఎలాంటి వివరాలు లేకపోవడంతో కాకినాడలోని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. బాబు చూడముచ్చటగా ఉన్నాడు. మాటలు రాని అతడిని ఎందుకు వదిలిపెట్టి వెళ్లారో తెలియడం లేదు. అతడిని వదిలించుకునేందుకు ఇలా చేశారని తెలుస్తోంది. తల్లిదండ్రులు అతడిని ఎలా వదిలారో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాబు అనాథగా పెరగాల్సి వస్తోంది. ముద్దులొలికే కొడుకునే వదిలించుకున్న తల్లిదండ్రులు ఏపాటి వారో అని శాపనార్థాలు పెడుతున్నారు. ఎవరికైనా దత్తత ఇచ్చినా వారు బాగా చూసుకునే వారు. కానీ ఇలా బాబును అనాథను చేసి వారి దారి వారు చూసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. అతడు అనాథగా చేరాల్సిన గూడు చేరినట్లు చర్చించుకుంటున్నారు.