Pawan Kalyan contest : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవ టీడీపీతో పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న విషయంపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న వాటిపైనే దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. అందుకే చిత్తూరు, తిరుపతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాలనే టార్గెట్ చేస్తూ జన సైనికులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, మదనపల్లి అసెంబ్లీ స్థానాలపై పవన్ అన్న జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆలోచిస్తున్నారట. ఈ వార్తలు బయటకు పొక్కడంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. గతంలో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కూడా తిరుపతి స్థానం నుంచే పోటీ చేసి గెలుపొందారు.
అయితే ఇప్పుడు అన్న బాటలో తమ్ముడు నడవాలని అనుకుంటున్నట్లు కనిపిస్తుంది. గతంలో భీమవరం, విశాఖ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన 2024లో తిరుపతి నుంచి బరిలో దిగితే మంచి ఫలితాలు వస్తాయని జన సైనికులు పవన్ కు ఫీడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై కూడా జనసేన ఫోకస్ పెట్టింది. చిత్తూరు జనసేను మంచి కేడర్ ఉంది. కొంచెం కష్టపడితే గెలుపు సులువు అవుతుందని భావిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల నాగబాబు ఉమ్మడి చిత్తూరులోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు.
ఇటీవల పొత్తులపై క్లారిటీ వచ్చిన నేపథ్యంలో టీడీపీ కేడర్ తో కలిసి పని చేయాలని జన సైనికులకు నాగబాబు సూచనలు కూడా చేశారు. ఎవరు బరిలో ఉన్నా కలిసి కట్టుగా పని చేస్తేనే విజయం సాధ్యమవుతుందని రెండు పార్టీల వారు కొట్టుకుంటే మళ్లీ వైసీపీ బయట పడుతుందని ఆయన హితబోధ చేశారు. సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు ఏఏ స్థానాల్లో ఎవరు నిలబడితే మేలు జరుగుతుందన్న విషయంపై జనసైనికులు నాగాబాబుకు వివరించారు.
ముఖ్యంగా బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు నాగబాబు. ఆయన నిర్వహించిన సమీక్షలో కూడా దీనిపైనే ఎక్కువగా మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరుకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, చిత్తూరు, నగరిపై ఫోకస్ పెట్టింది జనసేన. ఇక్కడనే బలిజ ఓటు బ్యాంకు భారీగా ఉంది. దీంతో పాటు ఇటీవల పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడుతున్న మంత్రి రోజాను కూడా కట్టడి చేయాలని నాగబాబు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఆమె నియోజకవర్గం నగరిలో పోటీ చేయాలని పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శిపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఇక నాగబాబు పర్యటన, సమావేశం నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. పొత్తులో భాగంగా తమ నియోజకవర్గం జనసేనకు వెళ్తుందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.