![Rajinikanth](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-13-15.jpg)
Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే ‘గోల్డెన్ వీసా’ను రజనీ అందుకున్నారు. గురువారం అబుదాబిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (డీటీసీ)లో సూపర్ స్టార్ గోల్డెన్ వీసా అందుకున్నారు. మలయాళీ వ్యాపారవేత్త ఎంఏ యూసఫ్ అలీ సమక్షంలో డీటీసీ ఛైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ దానిని రజనీకి అందజేశారు. అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ యూఏఈ ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించడం గర్వంగా ఉందన్నారు. వీసా విధి విధానాలను నిర్వహించినందుకు లులు గ్రూప్ అధినేత యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.
వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ గోల్డెన్ వీసాలను అందిస్తోంది. అలా 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలను అందజేస్తోంది దుబాయ్. ఇక ఈ వీసాలు అందుకున్న ఇండియన్స్ లలో షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, అల్లు అర్జున్, త్రిష, అమలాపాల్, మోహన్ లాల్, ముమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్, ఉపాసన ఉన్నారు.