Software engineer Died : గచ్చిబౌలిలోని ఓ హాస్టల్ భవనంలో నీటి సంపులో పడి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. టెక్కీ షేక్ అక్మల్ సూఫియాన్ (24) హైదరాబాద్ లోని ఒక హాస్టల్ లో ఉంటూ స్థానికంగా ఉన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. హాస్టల్ లో ఉంటూ రోజు వారి అవసరాల కోసం సరుకులు కొనుగోలు చేసేందుకు కిరాణా దుకాణానికి వెళ్లాడు. కొనుగోలు చేసి తిరిగి వచ్చాడు. హాస్టల్ గేటు లోపలి వైపు ఒక భారీ సంపు ఉంది. పై భాగంలో ఉన్న కప్పు తెరిచి ఉంది. సూఫియాన్ తెరిచి ఉన్న కప్పును గుర్తించలేదు. గేటు తెరుచుకొని నడుచుకుంటూ ముందుకు వెళ్లాడు.
కొన్ని అడుగులు వేసిన వెంటనే నీటి సంపులో పడిపోయాడు.ఈ క్రమంలో అతని గడ్డం కాంక్రీట్ అంచుకు తగిలింది. హాస్టల్ భవనం సమీపంలో నివసిస్తున్న ఓ బాలుడు ఎవరో నీటి సంపులో పడి ఉండటాన్ని గమనించి సంపులోకి తొంగిచూసినా ఆచూకీ లభించలేదు. బయటకు తీసేందుకు చాలా ప్రయత్నించాడు.
సాయంత్రం ప్రజలు సీసీ కెమెరాలతో పరిశీలించగా అందులో సూఫియాన్ పడిపోయినట్లు గుర్తించారు. సంప్ నుంచి అతన్ని వెలికి తీశారు కానీ అప్పటికే ఆయన మృతి చెందాడు. రాయదుర్గం పోలీసులు హాస్టల్ కు చేరుకొని నీటి సంప్ డోర్ తెరిచి ఉంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పీజీ హాస్టల్ యజమాని మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. హాస్టల్ లో వసతులే కాదు.. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని పలువురు అంటున్నారు.