Telangana Elections 2023 : తెలంగాణలో ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు బీజేపీ సైలెంట్ గా మారిపోయింది. రాష్ర్ట అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో ఊపు మీద కనిపించిన పార్టీ ప్రస్తుతం కొంత నిరుత్సాహంగా కనిపిస్తున్నది. దీనికి కారణం అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలే అనేది టాక్. ఇక తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ దూసుకెళ్తున్నది. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉండడం కూడా కారణంగా కనిపిస్తున్నది.
అయితే బీఆర్ఎస్ తో డీల్ కారణంగానే బీజేపీ ఈ పోరులో వెనుకపడిందనే టాక్ తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నది. రాష్ర్టంలో కాంగ్రెస్ గెలిస్తే ఇక ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందనే బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందంలో భాగంగా బీజేపీ సైలెంట్ అయ్యిందని చెబుతున్నారు. ఇక బీజేపీ సభలను కూడా ఆ స్థాయిలో మీడియా ఆసక్తికరంగా చూపడం లేదు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సభలకు చెప్పుకునేంత స్థాయి కవరేజీ దక్కలేదు. మరోవైపు ఈటల రాజేందర్ లాంటి వారు సీఎం కేసీఆర్ ను స్వయంగా రంగంలోకి దిగి శపథాలు చేస్తుంటే ఎలాంటి ప్రచారం లేకుండా పోయింది.
ఇక ఆఖరి నిమిషంలో బీజేపీలోని కొందరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని తెలిసినా, బీజేపీ పెద్దలు ఖాతరు చేయడం లేదు. అంతిమంగా బీఆర్ఎస్ కు మేలు చేసే పనిలో బీజేపీ ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. రాష్ర్టంలో బీఆర్ఎస్ కు బీటీంగా బీజేపీ, కేంద్రంలో బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ మారాయని చెబుతున్నారు. అయితే బీజేపీ కనీసం సింగిల్ డిజిట్ అయినా దక్కించుకుంటుందా అనేది ఇప్పుడు అనుమానంగానే మారుతున్నాయి.
మూడు నుంచి ఐదు సీట్లు మినహా పెద్ద సంఖ్యలో గెలిచే అవకాశం లేదని, అసలైన సమయంలోనే అస్ర్త సన్యాసం చేసి పార్టీ శ్రేణులను ఇరకాటంలో పడేసిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. మరి ఈసారి బీఆర్ఎస్ పట్ల విముఖత తో ఉన్న బీజేపీ శ్రేణులు ఎవరివైపు చూస్తారో ఆపార్టీ పెద్దలే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోరులో ఇప్పటికైనా గేరు మార్చకపోతే పార్టీకి తీరని నష్టం తప్పదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.