BRS and Congress : ప్రస్తుతం జమానా సోషల్ మీడియానే నమ్ముతోంది. గతంలో ప్రింట్ మీడియా, లేదంటే టీవీ ఛానళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు అవి పూర్తిగా మారిపోయాయి. ఇక పొలిటికల్ లో అబద్దాన్ని నిజం అని.. నిజంను అబద్ధమని నమ్మించేంత పవర్ సోషల్ మీడియా చేతిలోకి వెళ్లిపోయింది. కొవిడ్ నుంచి అంటే నాలుగేళ్లలో సోషల్ మీడియా ఏది చెప్తే అదే నిజం అని ప్రజలు నమ్ముతున్నారు.
కొవిడ్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న మార్పులను నిశితంగా గమనించిన బీఆర్ఎస్ పార్టీ విపరీతంగా పెంచుకుంది. సోషల్ మీడియాలో వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు తంటాలు పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ లోపం స్పష్టంగా కనిపించింది. తమ పార్టీ లీడర్ స్టేట్ మెంట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసి తామే రైటు కాంగ్రెస్ రాంగ్ అని చెప్పడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. అయితే కాంగ్రెస్ చెప్పే అంశాలు మాత్రం ప్రజల్లోకి వెళ్లలేదు. దీనికి కారణం సోషల్ మీడియా లేకపోవడమే.
బలంగా మార్చింది కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ పార్టీ సోషల్ మీడియాను విస్తృతం చేశాడు. ఇతర దేశాల్లో సైతం పార్టీకి అనుగుణంగా సోషల్ మీడియాలో పని చేసేందుకు సైన్యాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ప్రతి పక్షంలో ఉన్నా.. బీఆర్ఎస్ తమకు అనుకూలంగా ఏ వార్తనైనా ఇట్టే ట్రెండ్ చేయగలదు. గట్టిగా అనుకుంటే చాలు గంటలో తము అనుకున్న టాపిక్ ను ట్రెండింగ్ లోకి తేగలదు. అధికారంలో ఉన్న సమయంలో దూరదృష్టితో పరిశీలించిన బీఆర్ఎస్ సోషల్ సైన్యాన్ని సైతం పెంచుకుంది. దీంతో ఇప్పుడు విపక్షంలో ఉన్నా ప్రభుత్వం చెప్పింది వవాస్తవమని, తాము చెప్పిందే వాస్తవమని నిరూపించుకుంటున్నారు.
తేలి పోతున్న కాంగ్రెస్
ప్రస్తుతం అందరూ బిజీ అయిపోయారు. గతంలో సాయంత్రం వేళ టీవీలు చూస్తూ వాటిలో వచ్చే విషయాలపై చర్చించుకునేవారు.. రాను రాను ఆ చర్చ ఇంటి వరకు మాత్రమే పరిమితమైంది. ఇక ఇప్పుడు అది మరింత తగ్గి ఇంట్లో వాళ్లు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈ సమయంలో టీవీలు చూడడం అస్సలు కుదరడం లేదు. ఏది నిజం.. ఏది అబద్ధం.. అని సోషల్ మీడియానే చెప్తుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే పొలిటికల్ పార్టీలు వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సోషల్ మీడియా వ్యవస్థ లేదు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై కోపంతో కొందరు టీడీపీ నాయకులు కాంగ్రెస్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పని చేసినా ఎన్నికల తర్వాత ఎవరి దారి వారిదే.. ఈ లోపం ఇప్పుడు అధికార కాంగ్రెస్ కు స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వాయిసే ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ను ఎవరూ పట్టించుకోవడంలేదు.
బలోపేతం చేసుకోకుంటే కష్టమే
సోషల్ మీడియాలో ప్రచారాలకు ఎటువంటి నియంత్రణ లేదు. ఎవరు ఎక్కువగా ఏది నమ్మితే అదే వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో నిజామన్ని కూడా నమ్మించేందుకు చాలా ప్రయత్నాలు చేయాలి. ప్రజలే నిజం తెలుసుకుంటారని సైలెంట్ గా ఉంటే అబద్దమే నిజం అవుతుంది. రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఇలాంటివి ఎన్నో జరిగాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియా వింగ్ ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కష్టమే నన్న వాదనలు వినిపిస్తున్నాయి.