Andhra politics in Atlanta : ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో రాజకీయం అత్యంత రసవత్తరంగా ఉంటుంది. ఇక్కడ గెలిచేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఎందుకంటే టీడీపీకి కొరకరాని కొయ్యగా తయారైన వైసీపీ వివాదాస్పద నేత కొడాలి నాని ఇక్కడి నుంచి బరిలో ఉండడమే. అయితే టీడీపీ నుంచి ఈ సారి అమెరికాలోని జార్జియా రాష్ర్టం అట్లాంటా నగరవాసి రాము వెనిగండ్ల(ఎన్ఆర్ఐ) పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా, ఆయనకు అట్లాంటాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సంపూర్ణ మద్దతు దక్కింది. టీడీపీ, జనసేన సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో ప్రవాసులు రాము వెనిగండ్ల గెలుపునకు సహకరిస్తామని ముక్త కంఠంతో ప్రకటించారు.
‘అట్లాంటా ఫర్ రాము వెనిగండ్ల’ అంటూ అట్లాంటాలోని సంక్రాంతి రెస్టారెంట్ లో అక్టోబర్ 13 న ఈ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ ఆప్తుడిగా పేరున్న రాము వెనిగండ్ల గెలుపునకు తామంతా కలిసి వస్తామని ప్రకటించారు. అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ నేత, సంక్రాంతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాము వెనిగండ్ల మాట్లాడుతూ.. తన ఫౌండేషన్ ద్వారా ఆంధ్రాలోని గుడివాడలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలతో పాటు అన్న క్యాంటీన్లు, ఉద్యోగ మేళాలు, రైత భరోసా లాంటి కార్యక్రమాలను తన సేవా సంస్థ ద్వారా చేపడుతున్నట్లు తెలిపారు.
గుడివాడలో కొడాలి నాని లాంటి నాయకుడిని మళ్లీ గెలిపించేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా లేరని, తన గెలుపునకు అంతా సహకరించాలని కోరారు. ఇక అట్లాంటాలోని టీడీపీ నాయకులు లావు అంజయ్య చౌదరి, ముసునూరి సతీశ్, మేదరమెట్ల మల్లిక్, లావు శ్రీనివాస్, నిమ్మగడ్డ శ్రీనివాస్ ప్రసంగించారు. దీంతో పాటు జనసేన నేతలు ధూళిపూడి సురేశ్, ఎనుములు ఇన్నయ్య తదితరులు మాట్లాడుతూ రాముకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సుమారు 500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. వీ ఆర్ విత్ సీబీఎన్ అంటూ నినదించారు. సేవ్ డెమోక్రసీ ఇన్ ఏపీ అంటూ నినదించారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ గళమెత్తారు. ఇక తామంతా గుడివాడకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని అంతా ఏకాభిప్రాయంతో చెప్పుకొచ్చారు.