- ఏడాదంతా తలనొప్పులు తప్పవా..?
Difficult Time CM Jagan : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రానున్న ఏడాదంతా గడ్డు పరిస్థితే కనిపిస్తున్నది. ఒక వైపు ఏడాదిలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అవినాశ్ రెడ్డి అంశం పొలిటికల్ గా వైసీపీకి మచ్చలా మారింది. కోడి కత్తి ఘటన లో కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ తేల్చి చెప్పింది. ఇక ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం తలనొప్పిలా మారింది. ఇక రాజధాని అంశం కూడా జగన్ కు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతానికి అచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి వైసీపీకి ఎదురవుతున్నది.
దూసుకొస్తున్న ప్రతిపక్షాలు..
ఒకవైపు ప్రతిపక్షాలు కలిసికట్టుగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నాయి. వైసీపీ ని ఒంటరిని చేసి అస్ర్తాలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ర్టంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వైసీపీకి తలనొప్పిగా మారాయి. ఒకవైపు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెల్చుకొని టీడీపీ ధీమాగా కనిపిస్తుంటే, రోజురోజుకూ పార్టీలో పెరుగుతున్న అసమ్మతివాదులతో వైసీపీ ఢీలాపడుతున్నది. దుష్టచతుష్టయం చేస్తున్న ప్రచారంగా జగన్ కొట్టి పడేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితి కనిపిస్తున్నది. చాలా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నిలదీతలే ఎదురవుతున్నాయి. సంక్షేమ పథకాలు, మహిళల ఓట్లపై ఈసారి వైసీపీ బలంగా నమ్ముకుంది. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ ఫలాలు నేరుగా అందుతున్న వారు తమ వైపే నిలుస్తారని ఆ పార్టీ నమ్ముకుంది. కానీ రాజధాని, నిరుద్యోగుల అంశాలు, కుంటుపడిన అభివృద్ధి, పార్టీ నాయకుల తీరుతో వైసీపీకి ఎదురీత తప్పేలా లేదు.
నాయకత్వంలో సమన్వయలోపమే కారణమా..?
ఏపీలో 2019 ఎన్నికల తర్వాత వైసీపీ బలమైన పార్టీగా ఎదిగింది. టీడీపీకి కోలుకోలేని దెబ్బకొట్టి రోజురోజుకూ తన బలాన్ని పుంజుకుంది. ఇక తిరుగులేదనుకుంటున్న సమయంలో టీడీపీ అధినేత తన రాజకీయ చతురతతో దెబ్బలు కొడుతూనే ఉన్నారు. ప్రజల ఆకాంక్షలను తనవైపు తిప్పుకుంటూ సక్సెస్ అవుతున్నారు. మరోవైపు అగ్రశ్రేణి నాయకుల మధ్య ఉన్న సమన్వయ లోపం ఆయనకు కలిసివస్తున్నది. స్థానికంగా రౌడీల్లా వ్యవహారిస్తున్న కొందరు నాయకుల తీరు కూడా ప్రజల ఆలోచనల్లో మార్పునకు కారణమవుతున్నది.
ఇక వివేకా హత్య కేసు వైసీపీ ఇమేజ్ ను పెద్ద ఎత్తున్న డ్యామేజ్ చేసింది. రానున్న రోజుల్లో ఎంపీ అవినాశ్ అరెస్ట్ ఖాయమని ప్రచారం జరుగుతుండగా, జగన్ కుటుంబంలో ఐక్యత లేదన్న విషయం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు కొంత సక్సెస్ అవుతున్నట్లుగా నే కనిపిస్తున్నది. ఉద్యోగులకు చేస్తామని హామీనిచ్చిన అంశాలనే జగన్ పట్టించుకోకపోవడం.. అభివృద్ధిపై ప్రజలకు పూర్తిస్థాయి భరోసానివ్వలేకపోవడం ఇప్పుడు వైసీపీ గ్రాఫ్ పడేలా చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అకాల వర్షాలతో ప్రస్తుతం నష్టపోయిన రైతులను కనీసం జగన్ పరామర్శించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. భరోసానిచ్చేలా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం కూడా ఇక్కడి ప్రధానాంశం.