Damage KCR : ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగు చూసినప్పటి నుంచి రోజుకో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ స్కాంలో బడా నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో ఏపీ సీఎం జగన్ అనుయాయులతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతరు కల్వకుంట్ల కవితకు సీబీఐ, ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసి విచారణ జరపిన విషయం తెలిసిందే. ఎఫ్ఐఆర్ లోనూ కవిత పేరు చేర్చారు. అయితే ఈ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ పేర్కొంటున్న నిందితులు అప్రూవర్ గా మారడం వెనుక రాజకీయ కోణాలు దాగి ఉన్నట్లు అనుమానాుల వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కాంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
శరత్ చంద్రారెడ్డి బడా పారిశ్రామిక వేత్త. ఏపీ సీఎం జగన్ బినామీల్లో ఒకరనే ప్రచారం ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరబిందో రియాల్టీకి పోర్టులు, సెజ్లు దక్కాయి. పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవహారాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో విక్రయించే సగానికి పైగా మద్యం శరత్ చంద్రారెడ్డి కంపెనీల్లోనే తయారవుతుందని తెలుస్తున్నది. అయితే అతను అప్రూవర్ గా మారడం వెనుక జగన్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాతే ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ మారడం ఏమిటన్నది సస్పెన్స్ గా మారింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారనే పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తున్నది. అయితే కేసీఆర్ కూతురు కవితను వదిలేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలా వదిలేస్తే కేసు బలహీనపడిపోతుంది.
ఈ స్కామ్లో లంచాలు, పెట్టుబడులు, ఆదాయం భూములు అన్నీ కవిత చుట్టూనే తిరుగుతున్నాయి. ఇందులో కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ అయ్యారు. లిక్కర్ పాలసీ స్కామ్లో కవిత తరపున వీరిద్దరే వ్యవహారాలు చక్కబెట్టారని సీబీఐ పేర్కొంది. ఇప్పటికే సీబీఐ,ఈడీ వేసిన చార్జీషీట్లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు. నిందితులు అప్రూవర్లుగా మారితే స్కాం జరగలేదని వాదించే అవకాశం ఉండదు. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారికి చిక్కుల్లో పడక తప్పదని తెలుస్తున్నది. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అవడం ద్వారా కవితను టార్గెట్ చేసేందుకేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ కేసులో కవిత జైలుకు వెళితే ఎవరికీ ప్రయోజనం. తెలంగాణ సీఎం కేసీఆర్ ను డ్యామేజ్ చేయడానికేనా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కవిత జైలుకు వెళితే కేసీఆర్ జగన్ ను ఉపేక్షిస్తాడా అన్నది ఇక్కడ కీలక ప్రశ్న. జగన్ విజయంలో కేసీఆర్ పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.