Pawan letter to PM : ఏపీలో మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండడంతో ఎటూ చూసినా రాజకీయ వాతావరణమే కనపడుతోంది. పార్టీల అధినేతలు తమ తమ వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు..ఇలా అన్ని పార్టీలు రాజకీయ రణక్షేత్రంలో తలమునకలయ్యాయి. తాజాగా ప్రతిపక్ష జనసేన అధినేత పవన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ఏపీలో జరిగిన ఇండ్ల నిర్మాణంలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని ఏకంగా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు..
ఆంధ్రప్రదేశ్ లో ఇండ్ల నిర్మాణం పేరుతో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి 5 పేజీల లేఖ రాశారు. ‘‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో భూసేకరణ పేరిట రూ.32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారు. ఇండ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోంది. సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే నిజాలు తెలుస్తాయి..’’ అని అందులో పేర్కొన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూసేకరణలో కీలకంగా వ్యవహరించారని, గతంలో నిర్మించిన టిడ్కో ఇండ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదని ఆరోపించారు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికే ఇచ్చారని, ప్రభుత్వ తీరుతో మిగతా లబ్ధిదారులు విసుగు చెందారని అందులో పవన్ వివరించారు.
పవన్ లేఖపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. కానీ వైసీపీ ప్రభుత్వంపై కూటమి నేతలు చంద్రబాబు, పవన్ మాత్రం మరింతగా విరుచుకపడే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఇండ్ల అవినీతిపై ఫిర్యాదు చేసిన నేతలు.. రాబోయే రోజుల్లో పలు ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగిన అవినీతిపై కూడా నిలదీసే అవకాశాలు కనపడుతున్నాయి.