Inzamam-ul-Haq Resigns : 2023 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. రెండు మ్యాచుల్లో నెగ్గి నాలుగు మ్యాచుల్లో పరాజయం పాలైంది. దీంతో సెమీస్ ఆశలు గల్లంతు చేసుకుంది. ఈనేపథ్యంలో దిగ్గజ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జట్టు ఓటమికి కారణం తానేననే ఉద్దేశంతోనే రాజీనామాకు సిద్ధపడ్డాడు. తన రాజీనామా లేఖను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ జాకా అష్రఫ్ కు పంపించారు.
వన్డే ప్రపంచ కప్ 2023లో రెండు విజయాలు సాధించి నాలుగు అపజయాలు మూటగట్టుకుని సెమీస్ ఆశలను గల్లంతు చేసుకుంది. భారత్, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. దీంతో చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంజమామ్ ఉల్ హక్ కు పీసీబీ 15 మిలియన్ల పాకిస్తాన్ రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది అతడి ఆరు నెలల జీతానికి సమానం.
ఇంజమామ్ రాజీనామాపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్లేయర్స్ మేనేజ్ మెంట్ కోసం రిజిస్టర్ చేయబడిన కంపెనీలో అతడికి వాటా ఉందని ప్రచారం సాగుతోంది. ఈ కంపెనీ పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, షాహిన్ షా అఫ్రిది వంటి స్టార్ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి వాణిజ్య ఒప్పందాలు పర్యవేక్షిస్తున్నారు. మహమ్మద్ రిజ్వాన్ కు కూడా ఇందులో వాటా ఉంది.
కంపెనీలో వాటాదారుడిగా ఉన్న ఇంజమామ్ టీమ్ సెలెక్షన్ లో పక్షపాతం చూపాడనే ఆరోపణలు సోషల్ మీడియాలో ప్రధానంగా వస్తున్నాయి. ఇంజమామ్ ఉల్ హక్ పీసీబీ, ఆటగాళ్ల మధ్య మధ్యవర్తిత్వం వహించి వివాదాన్ని పరిష్కరించినట్లు ప్రచారం జరిగింది. ఆటగాళ్ల డిమాండ్లు పీసీబీ అంగీకరించిందని తెలుస్తోంది. దీంతో ఇంజమామ్ వ్యవహారం వివాదంలో పడినట్లు సమాచారం.