Yuvagalam Padayatra :
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ముందుగా పాదయాత్రను నిలిపివేశారు. విజయవాడకు చేరుకొని తండ్రిని కలుసుకున్నారు. అనంతరం తండ్రిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన తర్వాత నారా లోకేశ్ ఢిల్లీలో మకాం వేశారు. జాతీయ నాయకులతో పాటు జాతీయ మీడియాతో ఏపీ ప్రభుత్వ ఆగడాలను వివరించే ప్రయత్నించారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ కేసు నడుస్తున్న నేపథ్యంలో అక్కడే ఉండిపోయారు.
ఇక రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14 గా ఏపీ సీఐడీ లోకేశ్ ను చేర్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు లో పిటిషన్ వేసినా లోకేశ్ కు ఊరట లభించలేదు. దీంతో మరికొన్ని రోజులు ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక ఈ క్రమంలో యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. అయితే లోకేశ్ అరెస్టు కూడా తప్పదనే ఊహాగానాల నేపథ్యంలో పాదయాత్రను కొనసాగించేందుకు బ్రాహ్మిణీని రంగంలోకి దించాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నట్లు సమాచారం. ఆమెను ఇప్పటికే మానసికంగా సంసిద్ధం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నది. ఇందు కోసం ముఖ్యనేతలతో పాటు మరికొందరు ఆమెకు పలు సూచనలు ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తున్నది.
అయితే ముఖ్యనేతలిద్దరూ అరెస్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అక్టోబర్ మొదటివారంలో చంద్రబాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించకపోతే ఎలా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే నారా లోకేశ్ అరెస్ట్ అయితే బ్రాహ్మిణి, భువనేశ్వరిలను రంగంలోకి దించాలని టీడీపీ భావిస్తున్నది. టీడీపీ ఇలాంటి గడ్డుపరిస్థితులను ఎన్నో ఎదుర్కొందని, పార్టీ మళ్లీ బలంగా ప్రజల్లోకి వెళ్తుందని చెబుతున్నారు. ఇక ఏపీ సీఐడీ మాత్రం లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీకి వెళ్లి అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఏపీలో తర్వాతి పరిస్థితులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.