YCP Party Leaders :
ఎక్కడైనా ఎన్నికలు వస్తున్నాయంటే అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చిన్నాచితకా పార్టీల్లోనూ ఫలానా స్థానం కావాలంటూ పోటీ పడుతుంటారు. కానీ ఏపీ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఏకంగా అధికార పార్టీ నేతలే తాము ఈసారికి బరిలో ఉండమంటూ చేతులెత్తేస్తున్నారు. మొన్నటి వరకు సర్వేలు, పనితీరు బాగా లేదని, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రావంటూ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించిన ఏపీ సీఎం జగన్ కు అదే పార్టీ ప్రజాప్రతినిధులు తిరిగి షాక్ ఇస్తున్నారు. ఒక్క సారిగి సీన్ రివర్స్ కావడంలో జగన్ నోరెళ్లబెడుతున్నారు. కొద్ది నెలల్లో ఇంత తేడా ఏంటని , నేతల మాటలతో జగన్ షాక్ నుంచి తేరుకోవడం లేదు. ఉన్నట్టుండి పరిస్థితి ఇలా దిగజారడంతో మొన్నటి వరకు కర్ర పెత్తనం చెలాయించిన జగన్ ఇప్పుడు బతిమాలుకుంటున్నాడు. పోటీ ఉన్న చోట బుజ్జగింపులు, భవిష్యత్ హామీలు ఇవ్వడం కామన్. కానీ ఇక్కడ తాము పోటీలో ఉండమని తెగేసి చెబుతున్నా జగన్ వారి వెంట పడుతున్నాడు. ఎలాగైనా ఈసారి నిలవాలని ప్రాధేయపడుతున్నాడు.
కొద్ది నెలల క్రితం చాలా మందికి టిక్కెట్లు ఇవ్వబోమని జగన్ రెడ్డి పార్టీ అంతర్గత సమావేశంలో చెప్పారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. టిక్కెట్లు ఇవ్వని వారి జాబితాను కూడా ప్రకటించేశారని కూడా అప్పట్లో గుసగుసలు వినిపించాయి. పదేళ్లు అధికారంలో లేకున్నా జగన్ కోసం, పార్టీ కోసం పని చేశామని ఇప్పుడు పార్టీ టికెట్ నిరాకరిస్తే ఎలా అని మొన్నటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆవేదన చెందారు. తమ సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.
కానీ కొద్ది రోజుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టికెట్ రాదనే కంగారు ఎవరిలోనూ కనిపించడం లేదు. ఏ నియోజకవర్గంలో పోటీ కి దిగమని చేతులెత్తేస్తున్న వారే తప్ప.. చెయ్యి ఎత్తి ముందుకు వస్తాననే వారు ఒక్కరూ కనిపించడం లేదు. పోటీ చేయబోమనే వారి సంఖ్య రెండంకెలకు చేరుకంది. ఈ సారికి వదిలేయాలని జగన్ ను కోరుతున్నారు. ఇప్పటికైతే తమకు వద్దు కానీ .. తమ వారసులకు ఇవ్వాలని చెబుతున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం మీరే ఈ ఒక్క సారికి పోటీ చేయాలని కోరుతున్నారు. ధర్మాన ప్రసాదరావు ఇదే చెబుతున్నారు. తాను రెస్టు తీసుకుంటానని జగన్ రెడ్డికి చెప్పానని కానీ జగన్ రెడ్డి మాత్రం అన్నా ఈ ఒక్క సారికి పోటీచేయమని బతిమాలారని చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి వారే వైసీపీలో ఎక్కువగా ఉన్నారు. వైసీపీలో రాయలసీమ నుంచి కూడా టిక్కెట్ల కోసం పోటీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరినైనా మార్చాలనుకుంటే జగన్ రెడ్డి టిక్కెట్ ఇస్తే తీసుకుంటామన్నట్లుగా ఉన్నారు కానీ… పోటీ పడి తమకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేసేవారే కనిపించడం లేదు. సిక్కోలు నుంచి నెల్లూరు వరకూ ఈ సారి వైసీపీకి సిట్టింగ్లు లేకపోతే అభ్యర్థుల కొరత ఏర్పడేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లూరులో ఇప్పటికే అభ్యర్థుల కొరత కనిపిస్తున్నది. బలమైన నేతలంతా కానరావడం లేదు. ప్రకాశం జిల్లాలో వైవీ లేదా బాలినేని ఇద్దరిలో ఒక్కరే పార్టీలో ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. వైసీపీలో అసలు ఎన్నికల హడావుడే కనిపించడం లేదు. అన్ని స్థాయిల్లో నిరాశ పేరుకుపోయిందన్న వాదన వినిపిస్తోంది.