Ayyappa Swamy : అమెరికాలోని న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘ప్రాణ ప్రతిష్ట’ వేడుకలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఆలయంతో పాటు ఎడిసన్ మొత్తం ఆధ్యాత్మికత వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయంలో జరగాల్సిన నిత్య కైంకర్యాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తుండడంతో పాటు విగ్రహ ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు.
హరి హర సుతుడు అయ్యప్ప స్వామి సాయి దత్త పీఠంలోని శ్రీ శివ విష్ణు దేవాలయంలో కొలువు దీరబోతున్నారు. స్వామి వారితో పాటు శ్రీ ఆది శంకరాచార్య, శ్రీ రామానుజాచార్య, కాల భైరవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. ఈ వేడుకల కోసం ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. మార్చి 17 (ఆదివారం) నుంచి మార్చి 20 (బుధవారం) వరకు వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
ఇందులో భాగంగా మార్చి 17 (ఆదివారం)న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక పూజలు చేశారు. దేవతా అనుగని, గణపతి పూజ, పుణ్యహవచనం, కాలహస్తపానం, ధనలక్ష్మి పూజ, హారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
మార్చి 18 (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గణపతి పూజ, పుణ్యహవచనం, వాస్తు శాంతి, మృత సంగ్రహనం, అంకురార్పణం, యజమాన ఆచార్య రక్షాబంధనం, నూతన విగ్రహ జనాధివాసం, కుంభాలంకారం, కాళహస్త పఠనం, అగ్ని ప్రతిష్ట, ఫస్ట్ కాలయాగ పూజ, పూర్ణాహుతి, హారతి, తీర్థ ప్రసాద వితరణం నిర్వహించారు.
స్వామి వారల మూర్తులను శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ట చేస్తున్నట్లు ఈ ఆధ్యాత్మిక వేడుకల కోసం భారత్ నుంచి ప్రత్యేకంగా పూజారులను పిలిపించినట్లు ఆలయ కమిటీ తెలిపింది. ప్రాణ ప్రతిష్ట రోజు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తుల అంచనాలను బట్టి మరింత పెంచుతామని పేర్కొన్నారు.
All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)
More Images : Ayyappa Swamy Vigraha Pratishtapana Mahotsavam 2nd Day Photos