Chandrababu Strategy : ఏపీలో ప్రధాన పార్టీల వ్యూహాలు ఆసక్తిని రేపుతున్నాయి. గతంలో ఏ ఎన్నికల్లో లేని విధంగా ఎన్డీఏ కూటమిలో ఈసారి సీట్ల పంపకాలు జరిగాయి. ముఖ్యంగా తాజాగా అనపర్తి, దెందులూరు సీట్ల విషయంలో చెలరేగిన వివాదం టీ కప్పులో తుఫాన్ గా ముగిసింది. అయితే దీని వెనుక ఏం జరిగిందనే దానిపై ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. అనపర్తి, దెందులూరు సీట్ల విషయంలో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడారా అన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఎన్డీఏ సీట్ల పంపకాలు ఆలస్యం కావడంతో సహజంగానే చివరి నిమిషంలో కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీపై అనూహ్యంగా ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా బీజేపీకి 10 సీట్లు ఎక్కడ ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు-పురందేశ్వరి మధ్య జరిగిన చర్చల్లో అనపర్తిని బీజేపీకి ఇవ్వాలన్న చర్చ వచ్చింది. అయితే ఈ సీటును సోము వీర్రాజుకు కేటాయిస్తారని భావించినా అలా జరగలేదు. ఆయనకు బదులు గత ఎన్నికల్లో పోటీ చేసిన శివకృష్ణంరాజుకు ఇచ్చారు.
కానీ అప్పటికే టీడీపీ ప్రకటించిన జాబితాలో చోటుదక్కించుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హర్ట్ అయ్యారు. ఐదేళ్లుగా అనపర్తిలో శ్రమించిన తనను కాదని గత ఎన్నికల్లో బీజేపీ తరుఫున పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారన్న ప్రశ్నను సంధించిన నల్లమిల్లి జనంలోకి వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో అనపర్తి టీడీపీకి ఇచ్చేసి పక్క జిల్లాలో ఉన్న దెందులూరు సీటు తీసుకుని గారపాటి చౌదరికి ఇద్దామనుకున్నారు. కానీ అక్కడ సీనియర్ చింతమనేని ఒప్పుకోలేదు. చివరికి నల్లమిల్లిని బీజేపీలోకి పంపి అనపర్తి టికెట్ ఇచ్చేశారు.
అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా టీడీపీలో టికెట్ దక్కని నేతను బీజేపీలోకి పంపి టికెట్ ఇచ్చి మరీ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎందుకు వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే టీడీపీ అంతర్గత సర్వేల్లో అనపర్తితో పాటు దెందులూరు కూడా ఓడిపోతున్నట్లు తేలింది. అనపర్తి 3-4 శాతం ఓట్లతో పోతుంటే..దెందులూరు భారీ తేడాలో కోల్పోయే పరిస్థితి ఉంది. అటువంటప్పుడు ఈ రెండు సీట్లను బీజేపీకి ఇవ్వలేరు. అందుకే ఉన్నంతలో అవకాశం ఉన్న అనపర్తి సీటును బీజేపీకి ఇచ్చినట్టే ఇచ్చి టీడీపీ నేత నల్లమిల్లిని అక్కడికి పంపి పోటీ చేయిస్తున్నారు.
తద్వారా బీజేపీకి టికెట్ ఇచ్చి ఓట్లు వేయించలేదన్న అపవాదు భరించాల్సిన అవసరం చంద్రబాబుకు లేకుండా పోయింది. అనపర్తిలో నల్లమిల్లి గెలిస్తే ఆ క్రెడిట్ టీడీపీ ఖాతాలోనే పడుతుంది. ఓడినా పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే దెందులూరులో చింతమనేని గెలిస్తే ఇబ్బంది లేదు. ఓడిపోతే నష్టం కూడా లేదు. కానీ బీజేపీ నేత గారపాటి చౌదరికి ఇచ్చి భారీ తేడాతో ఓడిపోతే మాత్రం టీడీపీ ఓట్లు వేయించలేదన్న అపవాదును చంద్రబాబు మోయాల్సి వచ్చేది. దీంతో చంద్రబాబు సేఫ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది.