America : అమెరికాలో విషాదకర సంఘటన జరిగింది. మరో తెలుగు విద్యార్థి మరణించడంతో అతడి కుటుంబ సభ్యులను రోదనలో ముంచింది. ఇటీవల కాలంలో అమెరికాలో మరణిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరగుతుండడం బాధాకరం. ఈ ఏడాదిలో ఇప్పటికే 10 మంది వరకు వేర్వేరు కారణాలతో చనిపోయారు. దీంతో భారత్ లోని తల్లిదండ్రులు అమెరికాలో ఏం జరుగుతుందో తెలియక ఆవేదన చెందుతున్నారు.
ఉమా సత్యసాయి గద్దె అనే తెలుగు విద్యార్థి క్లీవ్ ల్యాండ్ లో నివసిస్తున్నారు. తన నివాసంలో మరణించి ఉండడంతో ఈ విషయాన్ని న్యూయార్క్ లోని భారత ఎంబసీ ధ్రువీకరించింది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. భారత్ లోని సత్యసాయి కుటుంబానికి సమాచారం అందించినట్లు ఎంబసీ ప్రతినిధులు తెలిపారు. డెడ్ బాడీని వీలైనంత తొందరగా భారత్ కు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఈ మేరకు తన ఎక్స్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది. అయితే మృతికి గల కారణాలను వెల్లడించలేదు.
ఈ నాలుగు నెలల్లోనే అమెరికాలో మరణించిన భారతీయ విద్యార్థుల సంఖ్య 10కి చేరడం కలకలం రేపుతోంది. అటు దాడులు సైతం యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మార్చిలో భారత్ కు చెందిన 34 ఏండ్ల శాస్త్రీయ నృత్య కళాకారుడు అమరనాథ్ ఘోష్ ను మిస్సోరిలోని సెయింట్ లూయిస్ లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. బోస్టన్ యూనివర్సిటీలో చదువుకునే గుంటూరుకు చెందిన విద్యార్థి పరుచూరి అభిజిత్.. డెడ్ బాడీని ఓ కారులో పోలీసులు గుర్తించారు. క్లీవ్ ల్యాండ్ లోనే నివసించే భారత్ కే చెందిన మహ్మద్ అబ్దుల్ ఆరాఫత్ ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలో దుండగులు దాడి చేశారు. అప్పట్లో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పర్య్డూ యూనివర్సిటీలో 23 ఏండ్ల విద్యార్థి సమీర్ కామత్.. ఫిబ్రవరి 5న ఇండియానాలో మృతదేహమై కనిపించాడు. పర్య్డూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య అనుమానస్పద మృతి, జార్జియాలో వివేక్ సైనీ దారుణ హత్యోదంతం, ఐటీ నిపుణుడు వివేక్ తనేజాపై వాషింగ్టన్ లోని ఓ రెస్టారెంట్ సమీపంలో ప్రాణాంతక దాడి..ఇవన్నీ సంఘటనలు అమెరికాలోని భారతీయులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా అమెరికాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా దాడి జరుగుతుందని తెలిసినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎంబసీ ప్రతినిధులు సూచిస్తున్నారు.