NTR Coin Price :
అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు. సినీ హీరోగా, ముఖ్యమంత్రిగా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. పేదలకు అండగా నిలిచిన తొలి రాజకీయ నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. తెలుగు జాతిని ఏకతాటి మీదకు తెచ్చి నాటి రాజకీయాల్లో పెను సంచలనంగా సీనియర్ ఎన్టీఆర్ ఎదిగారు. ఎన్టీఆర్ మరణించి రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ తెలుగు రాష్ర్టాల రాజకీయాల్లో ఆయన పేరు నిత్య స్మరణీయమే.
ప్రస్తుతం ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ, విదేశాల్లో ఆయన అభిమానులు పండుగలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్టీఆర్ పేరిట రూ. 100 నాణెన్ని ముద్రించింది. తాజాగా రాష్ర్టపతి ద్రౌపది ముర్ము, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఈ నాణెన్ని విడుదల చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ నాణెం ధరలను కేంద్రం నిర్ణయించింది. చెక్క డబ్బాతో అయితే రూ. 4850, ప్రూఫ్ ఫోల్డర్ ప్యాక్ తో అయితే రూ. 4380, యూఎన్సీ ఫోల్డర్ ప్యాక్ అయితే రూ. 4050 గా నిర్ణయించారు.
అయితే 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం జింక్, 5 శాతం నికెల్ మిశ్రమంతో ఈ నాణెన్ని తయారు చేశారు. సోమవారం ఉదయం పదిగంటల నుంచి ఇండియా గవర్నమెంట్ మింట్ వెబ్ సెట్ తో పాటు హైదరాబాద్లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ కౌంటర్లలో నేరుగా వీటిని కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.హైదరాబాద్ లోని ప్రభుత్వ నాణెల ముద్రణ కేంద్రం చీఫ్ జీఎం వీఎన్ఆర్ నాయుడు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతి చరిత్రపై ముద్రవేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన అభిమానులు ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వాములు కావాలని కోరారు. వ్యక్తిగత డిమాండ్లపై వీటిని పరిమితి మేరకు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఇక డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఇండియాగౌట్మింట్. ఇన్ ద్వారా ఆన్ లైన్ లో పొందవచ్చని తెలిపారు.