Madhyanna Bhojanam : అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదని అంటారు. ప్రభుత్వం చేయదు. వారే స్వయంగా మధ్యాహ్న భోజనం చేసుకుంటే దాన్ని అడ్డుకుని నానా హంగామా చేసిన వైసీపీ నేతల తీరుకు అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టించి పాఠశాల హాజరు శాతం పెంచారు. ఎవరు రాని పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడి చొరవతో విద్యార్థుల సంఖ్య 23కు పెరిగింది. దీంతో వారికి మధ్యాహ్నం భోజనం అందజేస్తూ విద్య నేర్పిస్తున్నారు. దీన్ని మంచి కార్యక్రమంగా చూడాల్సిన వైసీపీ నాయకులు తమ కడుమంటను ప్రదర్శించి విద్యార్థులను ఇంటికి పంపడం వివాదాలకు తావిచ్చింది.
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం ఇరగంపల్లి పంచాయతీ పరిధిలోని వంగంపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్న సంఘటన చర్చనీయాంశంగా మారింది. తమకు తెలియకుండా మధ్యాహ్న భోజనం ఎలా తయారు చేస్తారంటూ వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇళ్లకు పంపి పాఠశాలకు తాళం వేశారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు విషయాన్ని ఎంఈవోకు తెలియజేశారు. ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
రెండేళ్ల క్రితం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులే ఉండగా హెచ్ఎం చొరవతో వారి సంఖ్య 23కు పెరిగింది. ఏజెన్సీ నిర్వాహకుల సహకారంతో హెచ్ఎం కూడా కొంత డబ్బు వెచ్చించడంతో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రుల కమిటీ తీర్మానం మేరకు స్థానికులకు భోజనం తయారు చేసే బాధ్యతను అప్పగించారు. దీంతో వారు భోజనం అందిస్తున్నారు.
దీన్ని సర్పంచ్ గంగమ్మ భర్త శ్రీనివాసులు, రేషన్ డీలర్ రమేష్ జీర్ణించుకోలేక పాఠశాలకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. పాఠశాల గేటుకు తాళం వేసి ఉండటంతో అవాక్కయ్యారు. తాళం ఎవరు వేశారని తెలుసుకున్నారు. ఎంఈవో జాన్ రెడ్డప్పకు తెలియజేశారు. వైసీపీ నేతల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం ప్రసార మాధ్యమాల్లో రావడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు స్థానిక అధికారులను వివరణ కోరారు. ఎంఈవో పాఠశాలకు చేరుకుని గేటుకు తాళం తీయించి విద్యార్థులను రప్పించారు.