IPL 2024 : ప్రపంచ కప్ లో సత్తా చాటిన వారికి ఐపీఎల్ లో మంచి డిమాండ్ దక్కనుంది. ఈనేపథ్యంలో వారి ఫామ్ ఆధారంగా వారిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రానున్నాయి. ఐపీఎల్ టీంల ఏర్పాటుకు సమయం దగ్గర పడుతోంది. కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్ లో రాణించిన ప్రదర్శన ఆధారంగా వారికి డబ్బులు చెల్లించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.
డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 కోసం మినీ ఆటగాళ్ల వేలం జరగనుంది. ఎవరిని వదిలించుకోవాలనే దానిపై ఆయా జట్లు నిర్ణయం తీసుకోనున్నాయి. 26 లోపు జట్లు తమ జాబితాలను ఐపీఎల్ పాలకమండలికి సమర్పించాల్సి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా, జోఫ్రా ఆర్చర్ స్థానంలో ముంబై జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ గుజరాత్ కు వెళ్తాడంటూ చెబుతున్నారు.
ముంబయి టీం మాత్రం రోహిత్ ను కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్ సామ్ కర్రాన్ చరిత్ర లిఖించాడు. పంజాబ్ కింగ్స్ అతడికి ఏకంగా రూ. 18 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. కానీ అతడు మాత్రం 14 మ్యాచుల్లో 10 వికెట్లు మాత్రమే తీసి దారుణంగా దెబ్బతీశాడు. దీంతో ఈసారి అతడిని పంజాబ్ వదిలేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ స్టోక్స్ ను దూరం చేసుకోనుంది. అతడిని రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినా రెండు మ్యాచులే ఆడాడు. రూ.13 కోట్లతో కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ పై సన్ రైజర్స్ భారీగా ఆశలు పెంచుకున్నా ప్రయోజనం లేకపోయింది. కోల్ కత నైట్ రైడర్స్ నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు. ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన ట్రావిస్ హెడ్ పై ఫ్రాంచైజీలు ఫోకస్ చేసే అవకాశం ఉంది.