Mamata Banerjee : 1977 నాటి రాజకీయ చరిత్ర పునరావృత్తం అవుతుందా ! ఇండియా కూటమి విషయంలో మమతాబెనర్జీ యూటర్న్ తీసుకున్నారు. పశ్చిమబెంగాల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవద్దని నిర్ణయం దీదీ తీసుకోవడం ప్రస్తుతం హట్ టాఫిక్ గా మారింది. కాంగ్రెస్తో జతకట్టేందుకు నిరాకరించిన మమతాబెనర్జీ.. బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల క్షేత్రంలోకి అడుగు పెట్టకుండానే బీజేపీ నెత్తిన పాలుపోసినట్లుగానే భావించాలి.. “నా ప్రతిపాదనలను పట్టించుకోకపోవడమే కాదు, నా ప్రతిపాదనను కాంగ్రెస్ రిజెక్ట్ చేసింది “ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… బెంగాల్లో రాహుల్ నిర్వహించే న్యాయ్ యాత్ర గురించి తనకు తెలియదంటూ ఎన్నికల వేళ మమత కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఘలక్ ఇచ్చారు.
చరిత్రను కదిపి చూస్తే చిన్నచిన్న ఘటనలే దేశ రాజకీయాలను మలుపు తిప్పిన ఉదంతాలు మనకు అనేకం కనిపిస్తాయి. 28 – 1 = 27 పార్టీల “INDIA” ఓట్లు, సీట్లు – పట్టువిడుపులు, అలక పాన్పులు బుజ్జగింపులు చూస్తుంటే 1977 నాటి సంఘటన గుర్తుకొస్తోంది.
1997 అనగానే భారత జాతీయ రాజకీయ పటంలో 7 ఎమర్జెన్సీ గుర్తుకొస్తుంది. అత్యవసర పరిస్థితి తర్వాత పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ; ఇందిరా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ (ఓ) – నిజలింగప్ప, కామరాజ్ నాడార్, మొరార్జీ దేశాయ్, నీలం సంజీవరెడ్డి తదితరుల నాయకత్వంలో ఉన్న ఓల్డ్ కాంగ్రెస్ సీపీఐ (ఎం) ఎన్నికల ఒడంబడికకు కూర్చున్నాయి. మూడింట రెండొంతుల సీట్లు మాకే కావాలని ఓల్డ్ కాంగ్రెస్ మంకు పట్టుదలకు వెళ్లింది. కమ్యూనిస్టులు ప్రతిపాదనను ఓల్డ్ కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఇందిరా కాంగ్రెస్, ఓల్డ్ కాంగ్రెస్, సీపీఐ (ఎం) – మూడూ వేర్వేరుగా పోటీ చేశారు. కాంగ్రెస్ ఓట్లు చీలాయి. కమ్యూనిస్టులు గద్దెనెక్కారు. అలా కమ్యూనిట్లు పశ్చిమబెంగాల్ పై పిడికిలి బిగించారు. 30 ఏళ్లు నిరాటంకంగా కమ్యూనిస్టులు పాలించాలరు. జ్యోతిబసు అనంతరం బుద్దదేవ్ బట్టాఛార్య నాయకత్వాన్ని మమతా బెనర్జీ బద్దలు కొట్టే వరకు కమ్యూనిస్టులే పశ్చిమబెంగాల్ ని పరిపాలించారు.
మళ్లీ ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా “INDIA” పేరుతో ఏర్పడిన కూటమిలో సీట్ల సర్దుబాటులో లుకలుకలు బయల్దేరాయి. సంకీర్ణం అన్న తర్వాత సంక్లిష్టంగానే ఉంటుంది వాతావరణం. మోడీ లాంటి బలమైన నేతను జయించాలనుకున్నప్పుడు పొత్తు ధర్మం పాటించి సర్దుకుపోవడం ద్వారా కూటమిగా బలపడే అవకాశం ఉంది. అలా జరగని పక్షంలో మమతా బెనర్జీ వంటి సీనియర్ నేత వేయబోయే అడుగులు 1977 తరహాలో దేశ రాజకీయ చరిత్రను తిరిగి ఎలా మారుస్తుందో ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే..
– తోటకూర రఘు,
ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు.