Minister Roja Emotional : మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన నైతికతకే నిదర్శనమని భావోద్వేగంతో చెప్పారు. మహిళల పట్ల ఆయనకున్న అభిప్రాయం మేరకే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని బదులిచ్చారు. మహిళలు స్వతంత్రంగా బతకడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
చంద్రబాబుపై కఠినంగా మాట్లాడారు. ఆయనో అవినీతిపరుడని దుయ్యబట్టారు. టీడీపీ నాయకుల దొంగ దీక్షలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు జైల్లో దీక్ష చేయడం చూస్తుంటే మహాత్మగాంధీనే అవమానించారని అనిపిస్తోందన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దొందూ దొందే అని ఎద్దేవా చేశారు. బాబు జీవితం గాడ్సే కంటే ప్రమాదకరమైందని విమర్శించారు.
రాష్ట్రంలో అధికారం కోసం అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నారు. కానీ వారి కలలు పగటి కలలే. రాష్ట్రంలో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుంది. జనసేనకు అభ్యర్థులే కరువయ్యారు. ఇంకా ఆయన రాష్ట్ర గతిని మార్చేస్తారా అని ప్రశ్నించారు. ఒంటరిగా పోటీ చేయలేకే రెండు పార్టీలు కుమ్మక్కవుతున్నాయని మండిపడ్డారు. పొత్తులతో ఒరిగేది ఏమీ లేదని గుర్తు చేశారు.
టీడీపీ మోతమోగిద్దాం కార్యక్రమం కూడా ఫెయిలయింది. ప్రజలెవరు కూడా దానికి మద్దతు పలకలేదు. దీంతో పరువు కాస్త పోయింది. అంతేకాని ఏదో సాధిస్తామని చెబుతున్నా వారి ఆశలు అడియాశలే అవుతాయి. సన్నాసీ సన్నాసీ కలిస్తే బూడిదే రాలుతుంది కదా అని వారిని ఉద్దేశించి పేర్కొన్నారు. టీడీపీని టార్గెట్ చేసుకుని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.