YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా పులివెందులలో బహిరం సభ నిర్వహించింది. ఈ సభ లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్య గురించి మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన మాటల్లోనే.. ‘చిన్నాన్నకు రెండో భార్య ఉన్నమాట వాస్తవమా.. కాదా..? ఎవరు ఫోన్ చేయడం వల్ల అవినాశ్ ఆయన ఇంటికి వెళ్లాడు..? ఈ ప్రశ్నలకు వాళ్లు సమాధానం చెప్పాలి. అవినాశ్ ఏ తప్పూ చేయలేదు. అందుకే టికెట్ ఇచ్చాను. మా అందరికంటే చిన్న పిల్లోడైన అవినాశ్ ను తెరమరుగు చేయాలని చూడటం చాలా దారుణం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2019 ఎన్నికల సమయంలో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు విషయంలో నిజానిజాలు ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. గడిచిన ఐదేళ్లుగా ప్రతిపక్షాలు వైసీపీని ఇరుకున పెట్టేందుకు ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకుంటున్నాయి. అయితే ఇటీవల కడప హైకోర్టు ఈ కేసు విషయంపై మాట్లాడకూడదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించింది.