KCR : తెలంగాణలో ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలతో జనాల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే దివ్యాంగుల పింఛన్ పెంపు, బీసీ బంధు, మైనార్టీ బంధు తదితర కార్యక్రమాలతో ఆయన ఇంటింటినీ తడుతున్నారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఖజానాలో నిధులు లేక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వెంటనే మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. హైదరాబాద్లోని విలువైన భూముల వేలంlnతో పాటు మరో మూడు నెలల టైం ఉండగానే మద్యం దుకాణాల వేలం ప్రక్రియను పిలిచారు.
ఇప్పటికే శుక్రవారం రాత్రితో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ముగిసింది. గతంలో కంటే పెద్ద సంఖ్యలో దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఇదే ఇప్పుడు వేల కోట్లలో ప్రభుత్వ ఖజానాకు చేరింది. సుమారుగా రెండున్నర వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఇక మొన్న భూముల వేలం కూడా కాసుల వర్షం కురిపించింది. కొన్ని చోట్ల ఎకరాకు వందకోట్లు పలికింది. దీంతో పాటు ఓఆర్ఆర్ ను సుమారు 3వేల కోట్లకు లీజుకు ఇచ్చింది. ఇక కార్పొరేషన్ల ద్వారా పెద్ద ఎత్తున అప్పులను ప్రభుత్వం సేకరిస్తున్నది దీనికి అనుగుణంగా నిధులు మంజూరు చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు చిన్నవేమి కావు. రూ. లక్షల్లో లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట ఖజానాకు నిధులు సమకూర్చుకోవడానికి ప్రభుత్వం నిర్ణయంచింది. వీటిని మళ్లీ ప్రజలకే పంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది కేసీఆర్ ఆలోచన. ఏదేమైనా ఎన్నికలకు మరో మూడు నెలల ముందు ఇలాంటి పథకాలు తేవడం.. ఓట్ల ద్వారా లబ్ధి పొందడం ఏ పార్టీ అయినా చేసేది ఇదే. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇందులో కొంత ముందున్నారనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నది.