హైదరాబాద్ మహానగరంలోని కింగ్ కోఠిలోని ఓ కారు షెడ్డులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన మార్చి 25 తెల్లవారుఝామున జరిగింది. దాంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. భారీ శబ్దాలు చేస్తూ పేలుడు జరగడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే కారు షెడ్డులో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలకు పేలుళ్లు జరిగాయని భావించి ఊపిరి పీల్చుకున్నారు.
అయితే సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. కుటుంబ పోషణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తమ కొడుకు అర్దాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబం విలపిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. ఈ మంటల్లో 5 కార్లు దగ్దమయ్యాయి. రంగంలోకి దిగిన ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.