TDP-YCP : తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఇరు పార్టీల అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ దాఖలు చేసేందుకు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చంద్రగిరి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకేసారి ఆర్డీవో కార్యాలయం వద్దకు నామినేషన్ వేసేందుకు రావడంతో ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సమయంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చ్ోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చంద్రగిరి అసెంబ్లీ బరిలో వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తుండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పూలవర్తి నాని పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా ఈసారి ఎన్నికల్లో ఇరు పక్షాలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.