Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు తమదే అంటూ ప్రధాన పార్టీలు ధీమాగా ముందుకు సాగుతున్నాయి. ఇక ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన చిన్న గాయమైంది. దానికి బ్యాండేజ్ వేయించుకుని ఆయన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పటికీ ఆయన గాయం మానలేదా? అని ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
జగన్ కు అదృష్టవశాత్తు స్వల్ప గాయమైందని, లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది అంటూ వైసీపీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. అయితే గాయం తగిలి రెండు వారాలు దగ్గరకొస్తున్నా ఇంకా చిన్న గాయం మానలేదా? ఇంకా బ్యాండేజ్ తోనే జగన్ బస్సు యాత్ర కొనసాగిస్తుండడం ఏంటని అంటున్నారు. గాయం తీవ్రత తగ్గకపోవడంతోనే బ్యాండేజ్ తీయలేదా? లేదంటే సానుభూతి కోసమే బ్యాండేజ్ డ్రామా ఆడుతున్నారా? అంటూ జనాల్లో చర్చ జరుగుతోంది.
ఇలా ఆ చిన్న గాయానికి ఇంకా ఎన్ని రోజులు బ్యాండేజ్ ఉంచుకుంటారని.. ఎన్నికల పోలింగ్ అయ్యేదాక బ్యాండేజ్ తీయరా? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో కోడికత్తి డ్రామాతో సానుభూతి పొందిన జగన్..ఇప్పుడు కూడా గులకరాయి దెబ్బ ఘటనతో సానుభూతి పొందేందుకే కట్టు తీయడం లేదనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ బలం మ్యానిఫెస్టోనో.. అభివృద్ధో కాదని..జగన్ బ్యాండేజే అంటూ ప్రతిపక్షాలు, నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
జనాలను అంత తక్కువ అంచనా వేస్తే ఎలా సామి? అని కామెంట్ చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారని, చాలా తెలివిగల వాళ్లు అని అంటున్నారు. ఎప్పుడు ఎవరిని గద్దె ఎక్కించాలో..ఎప్పుడు ఎవరిని గద్దె దించాలో వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెబుతున్నారు. జగన్ చిన్న గాయానికే రెండు వారాల పాటు బ్యాండేజ్ వేసుకున్నారని.. రేపటి ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే కోలుకోవడం కష్టమేనని అంటున్నారు.