సుడిగాలి సుధీర్…పేరుకి తగ్గట్టే సుడిగాడు అనిపించుకుంటున్నాడు. మెజీషియన్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెరపై కమెడియన్ గాఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు. సుధీర్ ఏ షో చేసినా టీఆర్పీ బద్దలవాల్సిందే. అయితే స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న సుధీర్.. బిగ్ స్క్రీన్ పై కూడా దుమ్ముదులిపాడు. మొన్నటి వరకు చిన్న చిన్న దర్శకులతో పనిచేసినా సుదీర్ ఇప్పుడు ప్రభాస్ దర్శకుడితో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇటీవలే గాలోడు టైటిల్ తో బాక్సాఫీస్ ముందుకొచ్చి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. గాలోడు హిట్టవ్వడంతో సుధీర్ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వెండితెర గాలోడు…కాలింగ్ సహస్ర అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సుడిగాలి సుధీర్ కి బంపర్ లాటరీ తగిలినట్లు తెలుస్తోంది. ప్రభాస్కి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దశరథ్తో సుడిగాలి సుధీర్ సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
సుధీర్-దశరథ్ సినిమాకి నిర్మాతలు కూడా ఫిక్స్ అయ్యారట. అంతేకాదు, సుధీర్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా టాక్ వినిపిస్తోంది. దశరథ్ కమ్ బ్యాక్ అవ్వడానికి మంచి కథతో ఎదురుచూస్తుండగా.. ఆ కథకి సుడిగాలి సుధీర్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. సుధీర్కి కూడా కథ నచ్చడంతో.. దర్శకుడు దశరథ్తో కథను ట్రాక్ ఎక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పూజిత పొన్నాడతో మన వెండితెర గాలోడు రొమాన్స్ చేయబోతున్నాడట. ఈ సినిమాలో సుధీర్కి విలన్గా ఒకప్పటి సీనియర్ హీరోయిన్ని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా హిట్టైతే అటు సుధీర్ సుడి తిరగడం తిరిగినట్టేనని అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.