విడిపోయిన అన్నాదమ్ములను కలిపింది బలగం చిత్రం. అదేంటి అన్నాదమ్ములకు , బలగం చిత్రానికి సంబంధం ఏంటి ? అని అనుకుంటున్నారా ? నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చాంద అనే గ్రామానికి చెందిన గుర్రం పోశాలు , గుర్రం రవి ఇద్దరు అన్నాదమ్ములు. వారసత్వంగా వచ్చిన భూమి విషయంలో అన్నా – తమ్ముడు మధ్య గొడవలు పెరిగాయి. దాంతో ఇరు కుటుంబాల మధ్య మాటలు లేకుండాపోయాయి. దాంతో ఈ ఇద్దరు అన్నాదమ్ములను కలపడానికి చుట్టాలు , పెద్దలు ప్రయత్నాలు చేసారు కానీ కుదరలేదు. ఈ తతంగంలో గొడవలు మరింత ముదిరి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది.
అలా సంవత్సరాలు గడిచి పోయాయి. కోపం కూడా తగ్గిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో బలగం అనే సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో మానవ సంబంధాల గురించి వివరించారు. బలగం సినిమా హృదయాలను హత్తుకునేలా ఉండటంతో నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ చాంద లో కూడా ఊరందరికీ బలగం చిత్రాన్ని ప్రదర్శించాడు సర్పంచ్. ఇక ఈ సినిమాకు గుర్రం బ్రదర్స్ కూడా కుటుంబ సమేతంగా వచ్చారు. సినిమా చూశాక వాళ్లలో కన్నీళ్లు కట్టలు తెంచుకుందట. మానవ జన్మ ముందు ఈ తుచ్ఛమైన డబ్బు , ఆస్తులు ఏంటి ? ఇన్నాళ్లు భూమి కోసం అన్నా దమ్ముల అనుబంధాన్ని దూరం చేసుకున్నామే అంటూ పశ్చాత్తాప పడ్డారట. అంతేకాదు భూమి విషయంలో ఇద్దరూ తగ్గి పరిష్కరించుకున్నారు. అన్నాదమ్ములుగా గెలిచారు. దాంతో సర్పంచ్ తో పాటుగా ఆ ఊరి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బలగం సినిమా ఒక మంచి పని చేసింది అని సంబర పడుతున్నారు.