Revanth Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న బిల్లులు పెండింగ్ లో పెట్టాలని అధికారులను ఆదేశించారు.
60 వేల కోట్ల బిల్లులు క్లియరెన్స్ కోసం సిద్ధంగా ఉన్నాయని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వం చేసిన అవినీతిని దృష్టిలో ఉంచుకొని ఈ ఆదేశాలు జారీ చేశారు. అన్ని బిల్లులు, సంబంధిత పనులను సమీక్షించి ఆ తర్వాతే క్లియర్ చేస్తారని తెలుస్తోంది.
ఈ బిల్లులన్నింటినీ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన హయాంలో కావాలనే పెండింగ్ లో పెట్టారని అంటున్నారు. ఇప్పుడు వాటిని నిలుపివేసి రేవంత్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు కాంట్రాక్టర్లకు, నిర్మాణ సంస్థలకు తలనొప్పిగా మారాయి. తన అనుమతి లేకుండా ఎలాంటి బిల్లులు క్లియర్ చేయవద్దని రేవంత్ అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. పనుల నాణ్యత, చెల్లింపుల మొత్తాన్ని సమీక్షించాలంటే బిల్లుల క్లియరెన్స్ కు కనీసం రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
పెండింగ్ బిల్లుల్లో ఎక్కువ శాతం ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మౌలిక సదుపాయాలకు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం వద్ద ఉన్న నిధులను జీతాలు, పింఛన్ల చెల్లింపులకు వినియోగించాలని, ఆ తర్వాత అత్యవసర పనులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు చేసిన పనులు, వాటికి చేసిన చెల్లింపులను శాఖల వారీగా సమర్పించాలని రేవంత్ అధికారులను కోరుతున్నట్లు తెలస్తోంది. ప్రతి శాఖలోని పనులను ఆయన ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ప్రభుత్వంలో మార్పు వచ్చినప్పుడల్లా కాంట్రాక్టర్లకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం సాధారణమే. అనేక ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో నిధుల కొరత ప్రధాన సమస్యగా మారడంతో వాటిని అధిగమించి క్రమంగా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.