young Woman : మహిళలపై లైంగికదాడులు ప్రతీ రోజు ఎక్కడో మూల వినిపిస్తూనే ఉంటాయి. అవగాహన లోపమో.. మాయమాటలకు వంచనకు గురి కావడమో జరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో షీ టీమ్స్ వచ్చి అవగాహన పెరిగినా ప్రేమ పేరుతో బలవుతూనే ఉన్నారు. ఇలానే ఒక మహిళపై లైంగికదాడి జరిగింది. బ్లాక్ మెయిల్ చేసి ఇద్దరు వ్యక్తులు వరసగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లోని తాడిపత్రికి చెందిన యువతి చదువు కోసం విజయవాడలో ఉంటుంది. స్థానికంగా ఉండే కృష్ణారెడ్డి తనను ప్రేమించాలని బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు గతంలో ఒక సారి సూసైడ్ కు యత్నించాడు. తనతో సంబంధం పెట్టుకోవాలని యువతిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
ఆ తర్వాత కృష్ణారెడ్డి ఆ మహిళను బెంగళూరులోని తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడ ఆమెను నాలుగు రోజుల పాటు నరకం చూపినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత దివాకర్ అనే మరో వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి ఆమె, కృష్ణారెడ్డి వ్యక్తిగత, సన్నిహిత ఫొటోలు తన వద్ద ఉన్నాయని చెప్పాడు. ఆ తర్వాత ఆమెను ఇంటికి రమ్మని డిమాండ్ చేయగా, ఆమె అలా చేయగానే రెండు రోజుల పాటు ఆమెపై దాడి చేశాడు. అతను కూడా తనతో పాటు ఆ మహిళ ఫొటోలు కూడా తీశాడు.
ఈ ఫొటోలు స్థానిక గ్రూపులకు లీక్ కావడంతో అవి కాస్తా బాధితురాలి కుటుంబ సభ్యులకు చేరాయి. దీంతో షాక్ కు గురైన వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కేసులో నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.