karnataka congress: పదేళ్లుగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నా.. నాయకుల మధ్య విభేదాలతో అవికాస్తా చేజారేలా ఉన్నాయి. దక్షిణాదిన కర్ణాటకను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ఊపుమీదకు వచ్చింది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ గత పదేళ్లలో స్తబ్దుగా ఉంది. కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ కర్ణాటక గెలుపే తెలంగాణలో ఆ పార్టీకి జీవం పోసింది. అయితే ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న వర్గపోరు అధిష్టానాన్ని భయపెడుతుంది.
తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ రిలీజైంది. రేపటి (నవంబర్ 3) నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలుకానుంది. ఇప్పడు కర్ణాటకలో లుకలుకలు ఐదు రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్ర సీన్ కర్ణాటకలో కూడా రిపీట్ అవుతుందని వారు అంచనాలు వేస్తున్నారు.
సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాలు పొడచూపుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ తెలంగాణలో ప్రచారం పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చేందుకు వెళ్లాడు. ఇది అదునుగా భావించిన పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ సతీశ్ జార్కిహోళి.. 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక క్యాంప్ నిర్వహించాలని చూశాడు.
విషయం లీకవడంతో ఢిల్లీ పెద్దలు రణదీప్ సూర్జేవాల, కేసీ వేణుగోపాల్ హుటాహుటిన బెంగళూర్ చేరుకున్నారు. సతీశ్ తో మాట్లాడారు. దీంతో సతీశ్ కాస్తా వెనక్కి తగ్గారు. కానీ తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేసినట్లు తెలిసింది. కార్పొరేషన్ చైర్మన్ పదువల నియామకం విషయంలో ఎమ్మెల్యేలు వర్గాలుగా చీలిపోయి ప్రభుత్వమే కుప్పకూలే పరిస్థితికి వచ్చిందని తెలుస్తోంది. ఇదే జరిగితే మళ్లీ బీజేపీ కర్ణాటకను హస్త గతం చేసుకుంటుందని పలువురు రాజకీయ నిపుణులు చెప్తున్నారు.