Chandrababu : దేశంలో ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీల హవా కొనసాగింది. కాంగ్రెస్ కు దీటుగా అవి పనిచేసేవి. స్వాతంత్ర్యం ముందు నుంచే ఎంతో కమ్యూనిస్టు యోధులు మనదేశంలో ఉన్నారు. ఆ తర్వాత కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్టు పార్టీలు ఉండేవి. పలు రాష్ట్రాల్లోనూ సీపీఎం, సీపీఎం అధికారంలో ఉండేవి. ఇప్పటికీ కేరళ లాంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. ఇక గత కొన్నేండ్లుగా కమ్యూనిస్టు పార్టీల ప్రభావం తగ్గిపోతుందనే చెప్పాలి. సీపీఎం కాస్త ప్రభావవంతంగానే ఉన్నా సీపీఐ పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఆ పార్టీ జాతీయ పార్టీ హోదా కూడా పోయింది.
ఈ తరుణంలో తెలంగాణ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుంది. ఈ గెలుపు ద్వారా ఆ పార్టీకి కొత్త ఉత్తేజం వచ్చినట్టేనని చెప్పాలి. జాతీయ పార్టీ హోదాను మళ్లీ తెచ్చుకోవాలని సీపీఐ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమిలో కీలకంగా పనిచేస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటడానికి సీపీఐ జాతీయ నేత నారాయణ కూడా వ్యూహాత్మకంగానే ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు ద్వారా ఒక లోక్ సభ స్థానాన్ని తమకు కేటాయించాలని అడుగుతోంది.
ఇక ఏపీలో చంద్రబాబు, పవన్ కూటమితో వామపక్షాలు జతకూడితే జగన్ పార్టీని గద్దె దించవచ్చని సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ తరచూ అంటూ వస్తున్నారు. తమతో పొత్తు పెట్టుకోకపోతారా? అని టీడీపీకి మద్దతుగా, వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూనే వస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి భారతీయ జనతా పార్టీకి మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలిసీ కూడా సీపీఐ నేతలు తమ ప్రయత్నం చేశారు. అలాగే వివిధ అంశాల్లో బీజేపీకి టీడీపీ సపోర్ట్ ను కూడా వారు పెద్దగా పట్టించుకోలేదు. ఏపీ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుంటారనే నమ్మారు.
అయితే చంద్రబాబు, పవన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతోనే వెళ్లాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీతో పొత్తును దాదాపు ఖరారు చేసుకోవాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. చంద్రబాబు నిర్ణయంతో సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణలకు షాక్ తగిలినట్టే అని చెప్పాలి. టీడీపీ కూటమితో జట్టుకట్టి గత వైభవాన్ని తెచ్చుకుందామని ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు మాత్రం బీజేపీతో వెళ్లాలని భావిస్తుండడంతో కమ్యూనిస్టు నేతలు ఇక తమ దారి తాము చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.