BJP prove : ఖమ్మం రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ఇప్పటికే ఖమ్మంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నది. పొంగులేటి బీజేపీలో చేరకపోవడం వెనుక స్థానిక ప్రాంతంలో బీజేపీకి బలం లేదనే వాదన కూడా వినిపిస్తున్నది. ఇదే సమయంలో ఖమ్మంలో సత్తా చాటేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది.
ఖమ్మం వేదికగా బీజేపీ అధినేత అమిత్ షాతో బహిరంగ సభ నిర్వహించి ఖమ్మంలో అక్క తమ పార్టీ బలాన్ని నిరూపించుకోవాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు, తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టి సారిస్తుంది. బీజేపీ అగ్రనేతలు రాష్ర్టంలో పర్యటించనున్నారు.
ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 15న ఖమ్మంలో నిర్వహించనున్న బహింగ సభకు హాజరు కానున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట, మహబూబాద్ జిల్లాల నుంచి లక్షలాది మందిని తరలించి తమ సత్తా చాటేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. సభను విజయవంతం చేసి ఈ సమావేశం ద్వారా తమ సత్తా ఏంటో చూపించేందుకు సీనియర్ నేతలతో కమిటీ వేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో ఆశించిన స్థాయిలో బలం లేకపోవడంతో ఖమ్మంపై గట్టి ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఖమ్మంలో బీఆర్ఎస్కు ఎదురుగాలి వీచింది. రాష్ట్రం మొత్తం ఒక రకంగా తీర్పు ఇస్తే ఖమ్మం జిల్లా ఓటర్లు మాత్రం బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ నాయకులు ఆ స్థానాన్ని తాము భర్తీ చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ సభ తర్వాత గాలి ఎటువైపు మళ్లుతుందో వేచి చూడాల్సిందే.