గ్రౌండ్ రిపోర్ట్: ద్విముఖ పోరే
అసెంబ్లీ నియోజకవర్గం : వరంగల్ ఈస్ట్(పశ్చిమ)
బీఆర్ఎస్ : నన్నపనేని నరేందర్
కాంగ్రెస్ : కొండా సురేఖ
బీజేపీ : ఎర్రబెల్లి ప్రదీప్ రావు
Warangal East Constituency Review : 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ లోభాగంగా హన్మకొండ నుంచి విడిపోయి వరంగల్ ఈస్ట్ గా ఆవిర్భవించింది. వరంగల్ లోని 12 నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో వరంగల్ పట్టణంలోని 8 నుంచి 14 వార్డులు, 16 నుంచి 20, 22 వార్డులు దీని పరిధిలోకి వస్తాయి. ఇక మొత్తం ఓటర్ల సంఖ్య 1,98,928 (గత లెక్కల ప్రకారం) ఉంది.
వరంగల్ ఈస్ట్ రాజకీయాల్లో ఎక్కువ పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కొండా దంపతుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. 2009లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నుంచి బసవరాజు సారయ్య విజయం సాధించాడు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కొండా సురేఖ విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరింది. 2018లో ఆమెకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె పర్కాల నుంచి పోటీ చేసి ఓడిపోయింది. కానీ ఇప్పుడు వరంగల్ ఈస్ట్ నుంచే పోటీ చేయాలని చూస్తోంది. అసలు ఏ పార్టీ బలంగా, బలహీనంగా ఉందో చూద్దాం.
కాంగ్రెస్
వరంగల్ ఈస్ట్ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ హస్తంలోనే ఉండేది. బసవరాజు సారయ్య మొదటి ఎమ్మెల్యే కాగా.. తర్వాత కొండా సురేఖ కూడా కాంగ్రెస్ నుంచే గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ కు కేడర్ ఎక్కువగా ఉంది. దానికి తోడు చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కొండా దంపతుల హవా కొనసాగుతుంది. టీఆర్ఎస్ లో చేరిన వారికి పరాభవం ఎదురవడంతో పర్కాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్ ఈస్ట్ ను వదిలి తప్పు చేసినట్లు తెలుసుకున్నారు.
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మళ్లీ పుంజుకున్నారు కొండా సురేఖ. ఈమెకే ఈ సారి వరంగల్ టికెట్ అన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు నల్లేరుపై నడకే అన్నట్లుగా భావిస్తుంది కాంగ్రెస్. నియోజకవర్గం వ్యాప్తంగా బలమైన కేడర్ ఉంది.. దీనికి తోడు గతంలో రెండు సార్లు ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఉండడంతో కొండా దంపతులకు ఈ అవకాశాలు కలిసి వచ్చేలా ఉన్నాయి.
బీఆర్ఎస్
నన్నపునేని నరేందర్ ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే. కేసీఆర్ ఈ సారి సిట్టింగులకే టికెట్ అనడంతో బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీ చేస్తారని సంకేతాలు వస్తున్నాయి. కానీ ఆయనకు ప్రస్తుతం ఎదురు గాలి వీస్తుందనే చెప్పాలి. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కీలక నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గులాబీ పార్టీ నుంచి కమలంలోకి వెళ్లాడు. దీనికి కారణం ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడే అని పార్టీ కేడర్ బాహాటంగానే చెప్పుకుంటుంది. ఇక ఇదే టికెట్ పై పోటీ చేసేందుకు బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి కూడా ఇదే టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
కేసీఆర్ హామీ ఇచ్చినా నన్నపనేనికి మాత్రం ఈ సారి టికెట్ రావడం కష్టంగానే కనిపిస్తోంది. గతంలో అయితే టీఆర్ఎస్ హవా వీయడంతో ఆయన నెగ్గుకురాగలిగాడు కానీ ఈ సారి కష్టమేనంటూ బాహాటంగానే వినిపిస్తుంది. దీనికి కారణం నన్నపనేని ఒంటెద్దు పోకడ, కేడర్ ను కలుపుకోలేకపోవడం. దీంతో వరంగల్ ఈస్ట్ లో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. వారిలో వారు కట్టుకుంటుంటే తాము బయట పడతామని భావిస్తున్నారు కొండా దంపతులు. నన్నపనేని నరేందర్ అవినీతి అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ కడిగి పారేస్తున్నారు కొండా దంపతులు.
బీజేపీ
మొదటి నుంచి బీజేపీకి ఇక్కడ కేడర్ లేదు. ఉన్న కాస్త కేడర్ గతంలో టీడీపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 4000 ఓట్లకే పరిమితమైంది బీజేపీ. ఆ సమయంలో కుసుమ సతీశ్ పోటీ చేసి 4729 ఓట్లు తెచ్చుకున్నారు. అయిత తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం 45 వేల పైచిలుకు ఓట్లును బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇక్కడ ఈ పార్టీకి ఆశలు చిగురించాయి. ఈ ఓటు బ్యాంకును పరిశీలించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీ లో చేరారు. ఆయన ఈ సారి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే పార్టీ కేడర్ చురుకుగా పని చేసింది. కానీ ఎమ్మె్ల్యే ఒంటెద్దు పోకడతో పార్టీని వీడి బీజేపీలోకి వచ్చాడు. దీంతో ఆయన అనుచర ఘనం కూడా ఆయనతోనే వచ్చింది. ఇదంతా కలుపుకొని మరికొంత కష్టపడితే ఈ సారి బయట పడవచ్చని ప్రదీప్ రావు భావిస్తున్నారు. కానీ కొండా సురేఖ రూపంలో బలమైన ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలలో వ్యూహాలు సైతం తయారు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈ సారి పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. గతంలో రెండు సార్లు గెలిచిన పార్టీగా కాంగ్రెస్ నిలిస్తే.. ఒక్క ఉదుటున ఓటు బ్యాంకును పెంచుకున్నది బీజేపీ. ఇక బీఆర్ఎస్ నాయకులు వర్గ పోరులో మునిగిపోయాడు. అభ్యర్థు పరంగా చూసుకున్నా కొండా సురేఖకు ధీటుగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు నిలుస్తాడని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.