గ్రౌండ్ రిపోర్ట్: ద్విముఖ పోరే..
అసెంబ్లీ నియోజకవర్గం : అంబర్ పేట
బీఆర్ఎస్ : కాలేరు వెంకటేశ్
బీజేపీ : గంగాపురం కిషన్ రెడ్డి
కాంగ్రెస్ : వీ హన్మంతా రావు
Amberpet constituency అంబర్పేట నియోజకవర్గంలో ఈ సారి ద్విముఖ పోరే ప్రధానంగా కనిపిస్తుంది. హైదరాబాద్ లో గుర్తింపు దక్కించుకున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. గతంలో హిమాయత్ నగర్ లో భాగంగా ఉన్నా.. 2009 పూనర్విభజనలో భాగంగా అంబర్పేట ప్రత్యేక నియోజవర్గంగా ఏర్పడింది. ఇక అక్కడి నుంచి రెండు సార్లు 2009, 2014లో ప్రస్తుత కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు మంచి ఆదరణ ఉంది. 2.65 లక్షల మంది ఓటర్లు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నారు. ఇందులో ఐదు డివిజన్లు కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేట, అంబర్ పేట, గోల్నాక ఉన్నాయి.
అధికార బీఆర్ఎస్
అంబర్పేట ఏర్పడినప్పటి నుంచి బీజేపీకే ఆదరణ ఎక్కువగా ఉన్న 2018లో మాత్రం ఈ సీటును బీఆర్ఎస్ గెలుచుకుంది. ప్రముఖ న్యాయవాది కాలేరు వెంకటేశ్ 2018లో బీఆర్ఎస్ టికెట్ నుంచి పోటీ చేసి 11వేల మెజారిటీతో సమీప ప్రత్యర్థి గంగాపురం కిషన్ రెడ్డిపై విజయం సాధించారు. అప్పటి నుంచి కాలేరు ఈ నియోజకవర్గంలో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాలానుగుణంగా అంబర్ పేట కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడ జరిగే అభివృద్ధి పనుల్లో జాప్యం మాత్రం ఆయనకు కంటిమీద కునుకు రానివ్వడం లేదు. అత్యంత స్వల్ప మెజారిటీతో గెలిచిన కాలేరు వెంకటేవ్ కు నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది. ఛే నెంబర్ బ్రడ్జి పనులు నత్తనడకన సాగడం, కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకోకపోవడం, తీవ్రమైన వర్గ పోరు ఇక్కడ ఆయనకు ప్రతికూలంగా మారనున్నాయి. ఇక మూసారాం బ్రిడ్జీ కష్టాలు ప్రతీ ఏటా వర్షాకాలం ఇక్కడి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించడంలో కాలేరు విఫలమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక గత కార్పొరేషన్ కు నిర్వహించిన ఎన్నికల్లో కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేటలు బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోగా.. అంబర్ పేట, గోల్నాక మాత్రమే గులాబీ పార్టీ గెలుచుకుంది. దీంతో అక్కడ బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. సిట్టింగులకు టికెట్లు ని కేసీఆర్ ప్రకటించినా గోల్నాక కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ తనకే బీఆర్ఎస్ సీటు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి తోడు నియోజవకర్గం ఇన్ చార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డికి కాలేరుకు అస్సలు పడడం లేదు. దీంతో కానిస్టెన్సీ బీఆర్ఎస్ లో నాలుగు గ్రూపులు ఏర్పడ్డాయి. ఇక కాలేరు కూడా మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ కార్పొరేటర్లు, నాయకులను పిలవకుండా ఇష్టారీతిన వ్యవహరించడంపై కూడా కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఈ సారి టికెట్ కాలేరుకే వస్తుందా? అన్న సందేహం ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తుంది.
బీజేపీ నుంచి గంగాపురం కిషన్ రెడ్డి
అబర్ పేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి కంచుకోట. ప్రస్తుత కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఈ కానిస్టెన్సీ నుంచే రెండు సార్లు గెలుపొందారు. ఆయనకు ఇక్కడ చాలా ఫాలోయింగ్ ఉంది. 2018లో స్వల్ప మెజారిటీతో ఇక్కడి నుంచి ఓడిపోయిన ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచి.. కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఆయనే ఇక్కడ గెలుస్తూ వచ్చారు. 2009లో.. 2014లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ 2018లో మాత్రం ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
అయితే ప్రస్తుతం గంగాపురం కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ సారి ఇదే నియోజవకవర్గం నుంచి పోటీ చేస్తారని సంకేతాలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయనకు ఉన్న పలుకుబడి, రాష్ట్ర అధ్యక్షుడి హోదా నేపథ్యంలో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా ఇక్కడ మైనార్టీ జనాభా ఐదేళ్లలో పెరుగుతూ వస్తోంది. బీజేపీ పాలిటిక్స్ ఇక్కడ మరింత ఉపయోగపడతాయనే టాక్ కూడా ఉంది.
కాంగ్రెస్ నుంచి వీహెచ్!
దాదాపు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోలేకపోయింది. రెండు సార్లు పోటీ చేసినా ఏ మాత్రం ప్రతిభ చూపలేదు. దీనికి తోడు 2018లో పోటీనే చేయలేదు. ప్రస్తుతం నియోజవకర్గం పార్టీ బాధ్యతలను వీ హనుమంతారావు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఇక్కడ పార్టీ సభ్యత్వాలను కూడా చేపట్టేలేకపోయారు. ఈ సారి ఇదే నియోజవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ గౌడ్ నుంచి ఆయనకు చెక్ ఉంది. యువనేతగా గుర్తింపు సంపాదించుకున్న నూతి ఇదే టికెట్ ను ఆశిస్తున్నారు.
ఏది ఏమైనా అంబర్ పేట నియోజకవర్గంలో ద్విముఖ పోరు మాత్రమే ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే కాలేరుపై అసమ్మతితో ఉన్న వారు కాంగ్రెస్ వైపు కాకుండా బీజేపీ వైపు చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్విముఖపోరే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.