Dengue Rise : రాష్ట్రంలో విషజ్వరాలు పెరుగుతున్నాయి. డెంగీ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటి వరకు 20 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే మామూలు విషయం కాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏడిస్ ఈజిప్టి దోమ వల్ల డెంగీ సోకుతుంది. ఇది కుట్టడం వల్ల 4-7 రోజుల్లో లక్షణాలు బయట పడతాయి. 101-104 డిగ్రీల జ్వరం వస్తుంది.
తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్లు, నడుం నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో ఎన్ఎస్1 పరీక్ష చేయించుకుంటే డెంగీ బయట పడుతుంది. డెంగీ లేనట్లయితే మలేరియా, టైఫాయిడ్ లాంటివి కూడా అంటుకునే ప్రమాదముంటుంది. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. డెంగీ సోకితే బీపీ పడిపోయి ఇబ్బందులు తలెత్తుతాయి.
మెదడు, గుండె, కాలేయం, మూత్రపిండాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఇలా రోగి షాక్ లోకి వెళతాడు. 3-4 రోజుల్లో డెంగీ నియంత్రణలోకి వస్తుంది. అప్పటికి జ్వరం తగ్గకపోతే శరీరంపై రక్తపు దద్దర్లు ఏర్పడతాయి. తలనొప్పి, పొట్టలో నొప్పి వేధిస్తాయి. దీనితో ఆస్పత్రికి తరలించాలి. చాలా మందికి ప్లేట్ లెట్స్ పడిపోతుంటాయి. దీంతో వాటిని ఎక్కించాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం.
డెంగీ బారిన పడకుండా ఉండాలంటే ఇంట్లో దోమ తెరలు వాడాలి. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. దీని వల్ల దోమలు వ్యాప్తి చెంది మనల్ని కుట్టడం వల్ల రోగాలు వస్తాయి. ఇలా జాగ్రత్తలు తీసుకుని డెంగీ నుంచి రక్షణ పొందాలి. దోమలు కుట్టకుండా శరీరంపై నిండుగా దుస్తులు ధరించాలి. దోమలు వాలకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని దోమలకు దూరంగా ఉంటే డెంగీ రాకుండా ఉంచుకోవచ్చు.