Dissatisfaction in BJP : ఇప్పటికే మెజార్టీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులే లేరు. ప్రకటించిన కొన్ని సీట్లలో కూడా అసంతృప్త జ్వాలలు పెరిగాయి. రాజీనామాల పర్వం మొదలైంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఏనుగుల రాకేశ్ రెడ్డి ఈ సారి పార్టీ టికెట్ తనకు ఖాయమనే ఆశలు పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగా కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా తిరుగుతున్నారు. కానీ ఆయన ఆశల్ని ఇక్కడ పార్టీ పట్టించుకోలేదు. ఇక్కడ రావుల పద్మకు సీటు ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో రాకేశ్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆయన అనుచరులైతే కన్నీళ్లు పెట్టుకున్నారు.
మానకొండూర్ లో పార్టీ సీనియర్ నేత శంకర్ కు కాకుండా ఇటీవల కొత్తగా చేరిన ఆరెపల్లి మోహన్ కు పార్టీ టికెట్ కేటాయించారు. రామగుండంలో ఇటీవల చేరిన జడ్పీటీసీ కందుల సంధ్యారాణికి టికెట్ వచ్చింది. ఇక గోషామహల్ టికెట్ కోసం పార్టీలో చేరిన విక్రమ్ గౌడ్ కు నిరాశే ఎదురైంది. ఇక్కడ మరోసారి రాజాసింగ్ కే పార్టీ టికెట్ కేటాయించింది. నిజామాబాద్ అర్బన్ నుంచి మాజీ ఎమ్మెల్యే పార్టీ రాష్ర్ట అధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణకు బీజేపీ మొండి చేయి చూపించింది. ఆ స్థానం నుంచి ఎంపీ అర్వింద్ సూచించిన ధన్ పాల్ సూర్యానారాయణ గుప్తాకు పార్టీ టికెట్ ఇచ్చింది.
ఇక మరోవైపు మహబూబ్ నగర్ టికెట్ తనకే ఇవ్వాలని పార్టీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ పట్టుబడుతున్నారు. జాతీయ నాయకత్వం మాత్రం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ఆ టికెట్ ఇవ్వాలని చూస్తున్నది. అయితే పోటీకి ఆయన సిద్ధంగా లేరు. ఆయన కొడుకును బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం నుంచి ఆశలు పెట్టుకున్న పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి కి మొండిచేయి చూపారు. దీంతో ఐదేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్న ఆమె, కంటతడి పెట్టుకున్నారు. పార్టీకి రాజీనామా చేశారు.
రెండో జాబితా ప్రకటన ఇంకా రాకుండానే, మొదటి జాబితాకే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక రెండో జాబితా వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అభిప్రాయం వినిపిస్తున్నది. గెలుపు మాట అటుంచితే ప్రస్తుతం పార్టీ శ్రేణులను కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది.