Gujarat Titans : పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం ముల్హన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్లు మళ్లీ తేలిపోయారు. పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో కేవలం 142 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు ప్రభుసిమ్రన్, సామ్ కర్రన్ లు మంచి ఆరంభమే ఇచ్చినా.. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. చివర్లో హర్ ప్రీత్ బ్రార్ 29 పరుగులు చేయకుంటే ఇంకా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేవారు.
గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 4 వికెట్లు తీసి పంజాబ్ ను దెబ్బతీశాడు. ప్రభు సిమ్రన్ మూడు సిక్సులతో 35 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడి కేవలం రెండు మ్యాచ్ ల్లోనే గెలిచింది. దీంతో నెక్ట్స్ ఆడబోయే ఆరు మ్యాచుల్లో గెలిస్తేనే ప్లే ఆప్స్ చేరే అవకాశం ఉంటుంది.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా.. ఛేదనలో గిల్, సాయి సుదర్శన్ నెమ్మదిగా ఆడారు. స్లో పిచ్ కావడంతో వికెట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడారు. అయినా మధ్య ఓవర్లలో వికెట్లు పోగొట్టుకుని ప్రెషర్ లోకి వెళ్లిపోయింది. చివరకు రాహుల్ తెవాటియా.. ఆడిన డేరింగ్ ఇన్సింగ్స్ తో గట్టెక్కింది. రాహుల్ తెవాటియా 18 బంతుల్లోనే 7 ఫోర్లతో 36 పరుగులు చేసి గుజరాత్ ను గెలిపించాడు.
పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ ఒక్కడే మూడు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే మిగతా బౌలర్ల సహకారం లేకపోవడంతో మ్యాచ్ చేజార్చుకోవాల్సి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం ఎనిమిది మ్యాచ్ లకు నాలుగింట గెలిచి నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. మిగిలిన ఆరు మ్యాచుల్లో అయిదింట్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.