Team India : యువ ఆటగాళ్లతో నిండిపోయిన టీమిండియా వరుస వైఫల్యాలతో అభిమానుల్లో నిరాశను మిగుల్చుతున్నది. సీనియర్లంతా ఒకరితర్వాత ఒకరు రిటైర్మెంట్ ప్రకటించగా, ఇక ఇప్పటికైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే జట్టులో మిగిలిపోయారు. వీరికి విశ్రాంతి కల్పించి, విండీస్ టూర్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించగా వారు విఫలమయ్యారు. ప్రపంచకప్ వన్డే కు ముందు ఈ సిరీస్ కీలకం కాగా, విండీస్ పై ఓటమితో ప్రపంచకప్ కు వెళ్తుండడం ఆందోళన కలిగిస్తున్నది.
మొదట వరుసగా రెండు మ్యాచ్లో ఓడి.. ఆ తర్వాత రెండింటిలో గెలిచిన జట్టు.. ఆఖరి మ్యాచ్లో ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది. 2-3 తేడాతో సిరీస్ విండీస్ వశమైంది. ఈ టీ20 మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆదివారం మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్(61, 45 బంతులో 4ఫోర్లు, 3 సిక్స్ లు) రాణించాడు. ఇక విండీస్ బ్యాట్స్ మెన్లలో బ్రెండన్ కింగ్ (85 నాటౌట్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్ లు) విరుచుకుపడ్డాడు. మరో బ్యాట్స్ మెన్ పూరన్ కూడా 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. దీంతో ఈజీగా విండీస్ విజయం సాధించింది.
అయితే ప్రపంచకప్ కు ముందు భారత క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న యువ ఆటగాళ్లు ఇలా విఫలమవడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రయోగాలు చేయడం వద్దని అంటున్నా, రానున్న రోజుల్లో యువ ఆటగాళ్లే జట్టుకు కీలకం. దీంతో బీసీసీఐ ఇలాంటి మ్యాచ్ ల్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తుంటుంది. సన్నాహాక మ్యాచ్ లుగా ఈ సిరీస్ ఉపయోగపడుతుందనుకుంటే టీమిండియా సమష్టి వైఫల్యం ఈ సిరీస్ ద్వారా బయటపడింది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా విఫలమవుతున్నాడనే వాదనలు నిజమవుతున్నాయి. గత కొంతకాలం ఆయన కెప్టెన్సీపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
అయితే మరోవైపు యువ ఆటగాళ్లు సూర్య కుమార్ యాదవ్, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ అనుకన్నస్థాయిలో రాణించడం లేదు. ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్ లో పర్వాలేదనిపించినా, మిగతా మ్యాచుల్లో విఫలమవుతున్నారు. ఇక ఈ సిరీస్ లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఒక్కడే పూర్తిస్థాయిలో పర్వాలేదనిపించాడు. ఏదేమైనా యువ ఆటగాళ్లతో బలమైన జట్టుగా ఉండాల్సిన టీమిండియా ఇలా వైఫల్యాలను కొని తెచ్చుకోవడం సరికాదనే అభిప్రాయం అభిమానుల నుంచి వినిపిస్తున్నది. ప్రతిభకు కొదవ లేని చోట వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.