YCP Manifesto : ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీలు, నేతల హడావిడి పెరిగిపోయింది. ఓ పక్క అభ్యర్థుల ప్రకటనలు, మరో పక్క మ్యానిఫెస్టోల తయారీపై పార్టీల హైకమాండ్ లు దృష్టి సారించాయి. అధికార వైసీపీ మ్యానిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు వైసీపీ మ్యానిఫెస్టో కోసం ఎదురుచూస్తున్నాయి.
గత ఎన్నికల ముందు ‘నవరత్నాలు’పేరుతో సంక్షేమ పథకాలతో వచ్చి వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ సారి మ్యానిఫెస్టోలో ఏ కొత్త పథకం తెస్తారోనని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మ్యానిఫెస్టోపై కొన్ని లీకులు వస్తున్నాయి. రైతు, డ్వాక్రా రుణమాఫీలు ఉంటాయని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. అయితే ఇవేవి ఉండవని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రైతులకు ఏడాదికి ఇస్తున్న రూ.13,500 భరోసా సొమ్మును పెంచే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ సొమ్మును రూ.20 వేలు లేదా మరో వెయ్యి పెంచనున్నట్టు తెలిసింది. ఇందులో కేంద్రం వాటా యథావిధిగా ఉంటుంది.
అయితే డ్వాక్రా రుణమాఫీని నాలుగు విడతల్లో చేసి జగన్ మహిళల ఆదరణ చూరగొన్నారు. ఈసారి మహిళలకు జగన్ ఎలాంటి హామీలు ఇస్తారనే చర్చ విపరీతంగా జరుగుతోంది. ప్రతీ పథకంలోనూ గతంలో కంటే అధిక లబ్ధి చేకూరేలా మ్యానిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు. అమ్మఒడి లబ్ధిని రూ.15 వేల నుంచి రూ.20వేలకు పెంచే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అలాగే పింఛన్ ను రూ.3వేల నుంచి రూ.4వేలకు విడతల వారీగా పెంచనున్నారు. ఈ ఐదేళ్లలో అమలు చేసిన పథకాలనే తిరిగి కొనసాగిస్తామని, వాటి లబ్ధిని పెంచుతామని జగన్ హామీ ఇవ్వనున్నట్లు వైసీపీ ముఖ్యులు చెబుతున్నారు.