YS Jagan : ఏపీలో ఎటు చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో జరిగే ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యే అని చెప్పవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టి తమ గెలుపు అవకాశాలను మరింత పెంచుకున్నాయి. ‘‘ఈ మూడు పార్టీలు కలువవు..తన విజయాన్ని ఎవరూ ఆపలేరు’’ వైసీపీ అధినేత జగన్ అహంకారంతో విర్రవీగారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన వ్యూహాలతో జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
ఒంటరిగా పోటీ చేస్తే గత ఎన్నికల్లో వలె ఓటమి తప్పదనే అంచనాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూటమి కట్టారు. ఈ కూటమిలోకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని సైతం తీసుకొచ్చారు. రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని జగన్ దుర్వినియోగం చేసే అవకాశం ఉండడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చి జగన్ కు చెక్ పెట్టారు. గత ఐదేళ్లుగా బీజేపీకి లోపాయికారీగా మద్దతు తెలుపుతూ కేసుల నుంచి జగన్ తప్పించుకున్న విషయం తెలిసిందే. ఇక బీజేపీ.. టీడీపీ కూటమిలోకి రావడంతో జగన్ ఆటలు సాగవు.
మూడు పార్టీలు కలిసినా తనను ఓడించలేరని జగన్ పైకి ప్రగాల్భాలు పలుకుతున్నా.. లోలోపల మాత్రం భవిష్యత్ ను తలచుకుని వణికిపోతున్నారు. రేపటి ఎన్నికల్లో తాను ఓడిపోవడం ఖాయమని తెలిసి.. ఫ్రస్టేషన్ లో టీడీపీ, జనసేనపై ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లో జగన్ పై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉంది. అఖరికి సొంత చెల్లెలు కూడా ఆయనపై తిరగబడుతోంది. ప్రతిపక్ష నేతల కన్నా ఎక్కువగా జగన్ నే ఆమె టార్గెట్ చేస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు. జగన్ ఆమెను ఎంతగా మోసం చేశాడో. ఎంతో ఆవేదన ఉంటే తప్ప సొంత అన్నను ఓడించాలని షర్మిల చెబుతుందో ప్రజలు గమనిస్తునే ఉన్నారు.
అధికారం కోసం జగన్ చేసి పాపాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు రాబోతోంది. ప్రజా తీర్పుతో పాటు ఆ తర్వాత వచ్చే తన పాత కేసులపై కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేరం రుజువు కావడం ఖాయం కావడంతో జగన్ జైలుకు పోవడం కూడా అంతే ఖాయమని చెప్పవచ్చు. అధికారం ఉండడంతో కేసుల నుంచి తప్పించుకుని ఇన్ని రోజులు ఊరేగారు. ఇక చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. మరోసారి జైలుకు వెళ్లడం తథ్యం.