Lokesh Angry : తన తండ్రి అరెస్టు అప్రజాస్వామికమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్ర రాజకీయాలతో చంద్రబాబును జైలు పాలు చేశారని ఆరోపించారు. చేయని తప్పుకు బాధ్యుడిని చేస్తూ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడటంపై తన రక్తం మరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అన్యాయం ఎందుకు భరించాలని ప్రశ్నించారు.
బరువెక్కిన గుండెతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ రోజు చీకటి రోజుగా అభివర్ణించారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం కష్టపడుతున్న బాబును జైలు పాలు చేయడం తగదన్నారు. ప్రజల జీవితాలను బాగు చేస్తున్న నేతను కేసుల్లో ఇరికిస్తూ అన్యాయానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయితీగా ఉండే వ్యక్తిని కావాలనే కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించారని పేర్కొన్నారు.
రాజ్యాంగ వ్యవస్థపై తనకు నమ్మకం ఉంది. తన తండ్రి జైలు నుంచి ఎలాంటి కేసులు లేకుండా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి ఆశయాలు ప్రజలకు మేలు చేసేవిగా ఉంటాయి కానీ అన్యాయానికి అడ్రస్ గా ఉండవు. ఇది ముమ్మాటికి వైసీపీ కుట్ర అని చెబుతున్నారు. పోరాట యోధుడిగా నాన్నకు మంచి పేరుంది. ప్రజల కోసమే తన శక్తి సామర్థ్యాలు ప్రజలకు తెలిసినవే.
లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రకు కొంత కాలం విరామం ఇచ్చారు. పరిస్థితులు చక్కబడ్డాక పాదయాత్ర తిరిగి చేపడతామన్నారు. పాదయాత్ర శుక్రవారం నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడకు చేరుకుంది. కేసు ఓ కొలిక్కి వచ్చాక పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్ని మలుపులు తిరిగినా తన తండ్రి కేసులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.