New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. గత బీఆర్ఎస్ పాలనలో కొత్త కార్డులను జారీ చేయకపోవడంతో ఎంతో మంది పేదలు ప్రభుత్వ పథకాలు, బియ్యం పంపిణీకి దూరమయ్యారు. ఈక్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
జనవరిలో ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంది ప్రభుత్వం. రేషన్ కార్డు లేనివారు ఇప్పటికైనా స్థానిక రెవెన్యూ అధికారి వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఈనేపథ్యంలో తాజాగా కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయి కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడుతామని చెప్పారు.
ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారట. ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని అంటున్నారు. అంటే జూన్ 4న ఎన్నికల కోడ్ ముగియగానే రెండో వారం నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని చెప్పవచ్చు.
ప్రజాపాలనలో దాదాపు 19 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం వీరందరికీ ఇంటింటి సర్వే ఉంటుందని, ఈ సర్వేలో అర్హులైన కుటుంబాల లెక్క తేలుతుందని అంటున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని చెబుతున్నారు. దీంతో లక్షలాది పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగనుందని అంటున్నారు.